హనుమకొండ చౌరస్తా, మార్చి 13 : ప్రధాని మోదీ దేశానికి పట్టిన పీడ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షాపతి అని ఆయన పేర్కొన్నారు. ఈనెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సన్నాహకంగా ఆదివారం హనుమకొండలోని అమృత గార్డెన్స్లో కార్మిక సంఘాల ఐక్య సదస్సు నిర్వహించారు. ఆల్ ట్రేడ్ యూనియన్ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో సదస్సులో ముఖ్యఅతిథిగా హాజరైన చీఫ్ విప్ వినయ్భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేకత విధానాలు అనుసరిస్తూ దేశ సంపద, పేదప్రజల సొమ్మును అమ్మకానికి పెడుతున్నదని మండిపడ్డారు.
బీజేపీ కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నదని, బీజేపీ లీడర్లు దేశసంపదను మొత్తం అమ్మేస్తున్నారని మం డిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న ఇద్దరు అమ్ముతుంటే ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారని, ఈఎస్ఐ, పీఎఫ్ రద్దు చేస్తూ ఇబ్బం ది పెడుతున్నారని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే రైతులు ఐక్యంగా పోరాటం చేశారని, ప్రధాని క్షమాపణలు చెప్పేలా చేశారని గుర్తుచేశారు. దేశంలోని కోట్లాది మంది కార్మికులకు క్షమాపణ చెప్పే రోజుల దగ్గరలోనే ఉన్నాయన్నారు. నిరుపేదలు పైసా పైసా కూడబెట్టుకొని ఎల్ఐసీలో కడితే ఆ సంస్థను అమ్మేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు.
ఎల్ఐసీలో మొత్తం రూ.38 లక్షల కోట్లు ఉన్నాయని, అందులో 100 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఆస్తులని, ఎల్ఐసీలో నిజమైన యజమానులు పాలసీదారులు ఉన్నారని చెప్పారు. ఈనెల 28, 29న జరిగే దేశవ్యాప్త సమ్మెతో మోదీ ప్రభుత్వానికి సెగ తగిలిస్తామని, అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మెకు అందరూ మద్దతుగా నిలువాలని వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. సదస్సులో టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఇఫ్ట్యూ, టీఎంఆర్పీఎస్, టీఎన్టీయూసీ, ఎంటీఏడీయు, వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.