పీఎం స్వానిధి పథకం అమలులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందువరుసలో ఉంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలు, ఇతర పథకాలు అందించడంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నగరాన్ని వెనక్కి నెట్టి వరంగల్ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. నగరంలో 42,593 మంది వీధి వ్యాపారులు ఉండగా.. అందులో 36 వేల మంది రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 30 వేల మంది రూ.10 వేల చొప్పున రుణాలు అందుకున్నారు. పీఎం స్వానిధి మిషన్ ఇటీవల 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో టాప్ 10 జాబితాను ప్రకటించింది. అందులో తెలంగాణ నుంచి వరంగల్కు చోటు దక్కింది. త్వరలోనే కేంద్రం టాప్ 3 నగరాలను ప్రకటించి అవార్డులను అందజేయనుండగా అందులో జీడబ్ల్యూఎంసీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
వరంగల్, మార్చి 13 : ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వానిధి) పథకంలో మొదటి నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు వరుసలో నిలుస్తోంది. వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో జీడబ్ల్యూఎంసీ దేశంలోనే టాప్లో ఉంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నగరాన్ని దాటి వరంగల్ నగరం మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. పీఎం స్వానిధిలో అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నగరాలకు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించనుంది. అయితే, మొదటి నుంచి ఈ అమలు కోసం శ్రమిస్తున్న గ్రేటర్ వరంగల్కు అవార్డు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీధి వ్యాపారులకు రుణాలు అందించడంతో పాటు బీమా, ఇతర పథకాలు వర్తింపజేసేందుకు గ్రేటర్ ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగానే వరంగల్ నగరంలో 42,593 మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు గుర్తించారు. అందులో 36 వేల మంది పీఎం స్వానిధి పథకం రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 30 వేల మంది రూ.10 వేల చొప్పున రుణాలు అందుకున్నారు. 1.11 లక్షల వ్యాపారుల కుటుంబసభ్యులు ఉండగా వారిలో 70 వేల మందికి స్వానిధి పథకం ద్వారా ఇన్సూరెన్స్, మాతృ వందనం పథకాలను వర్తింపజేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నగరాన్ని దాటి వరంగల్ నగరం మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
త్వరలో టాప్ 3 నగరాల ప్రకటన
పీఎం స్వానిధి పథకం అమలు చేయడంలో విశేషంగా కృషి చేసిన టాప్ 10 నగరాల్లో గ్రేటర్ వరంగల్కు చోటు దక్కింది. ఈ మేరకు కేంద్ర పీఎం స్వానిధి మిషన్ ఇటీవల 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో టాప్ 10 జాబితాను ప్రకటించింది. అందులో తెలంగాణ నుంచి గ్రేటర్ వరంగల్కు చోటుదక్కింది. త్వరలోనే టాప్ 10 నగరాల జాబితా నుంచి టాప్ 3 నగరాలను ప్రకటించి అవార్డులను అందజేయనుంది. ఇప్పటికే కేంద్ర స్వానిధి స్క్రీనిం గ్ కమిటీ వివిధ కేటగిరీల్లో టాప్-10 నగరాల జాబితాను ప్రకటించింది. వీధి వ్యాపారులకు రుణాల మంజూరు, వివిధ సంక్షేమ పథకాల వర్తింపజేయడంలో గ్రేటర్ వరంగల్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విషయం తెలిసిందే.
రుణాల మంజూరుకు ప్రత్యేక శిబిరాలు
పీఎం స్వానిధి అవార్డు అందుకోవడంలో జీడబ్ల్యూఎంసీ అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటికే దేశంలో టాప్ 10 నగరాల జాబితాలో స్థానం దక్కించుకున్న గ్రేటర్ వరంగల్ టాప్ 3లో ఉండేందుకు శ్రమిస్తోంది. 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో దేశంలోనే నంబర్ వన్గా నిలిచిన నగరం రెండో విడుత రుణాల మంజూరులో సైతం ముందుంది. పీఎం స్వానిధి రుణాల మంజూరు కోసం ప్రత్యేకంగా వారం రోజుల పాటు గ్రేటర్ అధికారులు శిబిరాలు నిర్వహిస్తున్నారు. పీఎం స్వానిధి అవార్డు సాధించాలన్న లక్ష్యంగా గ్రేటర్, మెప్మా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఐదు రోజల క్రితం స్వానిధి మిషన్ కేంద్ర బృందం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో హనుకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. వీధి వ్యాపారుల గుర్తింపు, రుణాల మంజూరులో అవలంబించిన విధానం, స్వానిధిలోని పథకాలపై వీధి వ్యాపారులకు అవగాహన కల్పించడం లాంటి అంశాలపై వివరించిన విషయం తెలిసిందే. త్వరలో కేంద్రం ప్రకటించనున్న పీఎం స్వానిధి అవార్డు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.