వర్ధన్నపేట, నవంబర్ 30 : ముదిరాజ్ల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు మండలంలోని ఇల్లంద గ్రామంలో మంగళవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని పెద్దచెరువు వద్ద ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆర్థికసాయంతో ఆలయాన్ని నిర్మించగా మంగళవారం విగ్రహానికి జలాభిషేకం చేశారు. ఇందులో భాగంగా ముదిరాజ్ కులస్తులు ప్రతీ కుటుంబం నుంచి ఇంటి పెద్ద బిందెలో నీటితో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. బుధవారం విగ్రహ యంత్ర ప్రతిష్ఠాపన, కల్యాణం, హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సర్పంచ్ సుంకరి సాంబయ్య, తెలిపారు. గురువారం బైండ్ల పూజారులతో ఎల్లమ్మతల్లి పట్నాలు, శుక్రవారం కులస్తుల విందుభోజనాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆయన పేర్కొన్నారు.