వరంగల్ చౌరస్తా, నవంబర్ 13: న్యాయపరమైన అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు అన్నారు. వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో పాన్ ఇండియా లీగల్ అవెర్నెస్ ప్రోగాం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి జీవీ మహేశ్నాథ్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా నర్సింగరావు హాజరై మాట్లాడుతూ న్యాయ స్థానాల ద్వారా ప్రజలు పొందే సేవలను వివరించి, వారిలో చైతన్యం తీసుకురావడానికి ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఆర్థిక బలహీనత, సాంఘిక, సంస్కృతిపరమైన కారణాలతో పేదలు అన్యాయానికి గురికావొద్దనే ఉద్దేశంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మానవ అక్రమ రవాణా బాధితులు, మతిస్థిమితం లేనివారు, సామూహిక విపత్తు, హింసాకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాల ప్రభావంతో నష్టపోయిన వారు, పేదరికంతో మగ్గుతున్న వారికి ఉచిత న్యాయ సలహాలు అందించడంతోపాటు వారి వాదనలు కోర్టుకు వినిపించడానికి ఉచితంగా న్యాయవాదిని నియమించి, వారికి న్యాయం జరిగేలా చూస్తామని వివరించారు.
ఉచిత న్యాయ సేవలు పొందాలి
న్యాయ సేవాధికార సంస్థ నిర్వహిస్తున్న ఉచిత సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు. న్యాయం కోసం పోరాడాల్సిన అవసరమున్న వారికి ఈ వివరాలు తెలియజేసి వారు న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించేలా చూడాలన్నారు. అనంతరం డీఆర్డీఏ ద్వారా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు, కార్మిక శాఖ ద్వారా లేబర్కార్డులు, ఈ-శ్రమ్ కార్డులు, అచేతనస్థితితో ఇబ్బందులు పడుతున్న వారికి వీల్చైర్స్, కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వరంగల్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తిరుమల్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సామ్యూల్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేపీ ఈశ్వర్నాథ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు సబితా, శారద, డీసీపీవోలు, సీడీపీవోలు, వరంగల్, హనుమకొండ సెర్ప్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
న్యాయ సేవలను వినియోగించుకోవాలి
ఖిలావరంగల్: పేద ప్రజలు, మహిళలు, వృద్ధులు న్యాయస్థానంలో ఉచితంగా న్యాయ సేవను పొందడానికి రాజ్యాంగంలో ప్రజలకు అవకాశం కల్పించిందని జిల్లా న్యాయమూర్తి కే శైలజ అన్నారు. దూపకుంట రోడ్డులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో నల్సా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవతోపాటు బాలల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీ శ్రీనివాసరావు, మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ సతీశ్, ప్రిన్సిపాల్ శ్రీపాల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.