వరంగల్, నవంబర్ 26: గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా జరుగాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్లో శనివారం ఆమె కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ప్రజారోగ్యం, మెడికల్ అండ్ హెల్త్ అధికారులతో వరంగల్ మహా నగరంలో డివిజన్ల వారీగా పారిశుధ్య వ్యవస్థపై సమీక్షించారు. ప్రతి కార్మికుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు విధానం పాటించాలని మేయర్ సూచించారు. దాని ప్రకారమే వేతనాలు చెల్లిస్తామన్నారు. శానిటరీ జవాన్లు క్షేత్రస్థాయిలో కార్మికులతో మూడుసార్లు బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటికీ చెత్త సేకరణ వందశాతం జరుగాలన్నారు. జవాన్లు స్వచ్ఛ ఆటోల లాగ్బుక్ల నిర్వహణ పక్కాగా చేయాలన్నారు. ప్రతి డివిజన్లో సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను పీపీటీలో అప్లోడ్ చేయాలన్నారు. సమీక్షలో డిప్యూటీ కమిషనర్ అనీసుర్ రషీద్, శ్రీనివాస్రెడ్డి, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, ఈఈ సంజయ్కుమార్, వెటర్నటీ అధికారి డాక్టర్ గోపాల్రావు పాల్గొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి
ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బల్దియా జేఏసీ ఆధ్వర్యంలో కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1949లో నవంబర్ 26న రాజ్యాంగాన్ని అమోదించారని గుర్తుచేశారు. అనంతరం రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, ఎస్ఈ కృష్ణారావు, సీహెచ్వో శ్రీనివాసరావు, కార్యదర్శి విజయలక్ష్మి, ఏఏవో సునీత, జేఏసీ అధ్యక్షుడు గౌరీశంకర్ పాల్గొన్నారు.
ఆధార్ నవీకరణ కేంద్రం తనిఖీ
బల్దియాలోని ఆధార్ నవీకరణ కేంద్రాన్ని మేయర్ సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఆధార్, ఈపీఎఫ్ల్లో తప్పులను సరిచేస్తున్న విధానాన్ని పరిశీలించారు. శానిటేషన్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న కార్మికులు తప్పుల నమోదుతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జరిగిన తప్పులను జాగ్రత్తగా సరి చేయాలని సూచించారు. ఆమె వెంట రాంప్రసాద్ ఉన్నారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
కరీమాబాద్: ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకొని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ 42వ డివిజన్ రంగశాయిపేటలోని స్వశక్తి భవన్లో శనివారం శాంభవి మహిళా సంక్షేమ మండలి వార్షికోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు సీఎం కేసీఆర్ రుణాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. కుట్టు శిక్షణ పూర్తి చేసిన మహిళలు టెక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేసిన కిటెక్స్ సంస్థలో ఉద్యోగం సాధించేలా ట్రైనింగ్ తీసుకోవాలన్నారు. స్థానిక కార్పొరేటర్ గుండు చందనా పూర్ణచందర్ అద్యక్షతన జరిగిన సమావేశంలో 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి, మాజీ కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి, స్త్రీనిధి మేనేజర్ శ్రీవిద్య, శాంభవి మహిళా మండలి అధ్యక్షురాలు మాడిశెట్టి కవిత, ఉపాధ్యక్షురాలు బక్కి రమాదేవి, ప్రధాన కార్యదర్శి శెంకేసి రాధిక, కోశాధికారి శేర్ల అమరావతి, సహాయ కోశాధికారి అడున కవిత, సహాయ కార్యదర్శి బక్కి జయ, కానుగంటి పద్మావతి, టీఆర్ఎస్ నాయకులు దామెరకొండ కరుణాకర్, ముత్తినేని రామ్మూర్తి, బక్కి వంశీ పాల్గొన్నారు.