యాసంగిలో సాగుచేసే ఆరుతడి పంటల వివరాలను తెలుసుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. యాసంగి వడ్లు కొనేది లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. వ్యవసాయ అధికారులు కూడా ఆరుతడి పంటలు సాగు చేస్తే మేలని, ప్రభుత్వ మద్దతు ధర కూడా ఉందని రైతులకు కొద్ది రోజులుగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరుతడి పంటలైన శనగ, వేరుశనగ, కందులు, పెసర, నువ్వులు, జొన్న, పొద్దుతిరుగుడు, రాగులు తదితర పంటల సాగు వివరాలపై దృష్టిసారిస్తున్నారు. పెట్టుబడులు, దిగుబడులు, ఆదాయం, మద్దతు ధరల గురించి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా కొన్నేళ్లుగా మార్కెట్ లో ఉన్న డిమాండ్, పలికిన ధరలు, ప్రస్తుత రేట్లపై చర్చించుకుంటున్నారు.
వరంగల్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్లను కొనబోమని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించింది. వరికి బదులు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలను సాగుచేయాలని రైతులకు సూచిస్తోంది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు మన నేలలు అనువైనవని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా ఆరుతడి పంటల సాగుకు అన్నీ అనుకూలతలే ఉన్నాయని, వీటికి ప్రభుత్వం మద్దతు ధర కూడా నిర్ణయించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పంటల మద్దతు ధరలను రైతులు తెలుసుకుంటున్నారు. కొన్నేళ్ల నుంచి మార్కెట్లో పలికిన ధరలు, ప్రస్తుతం లభిస్తున్న ధరలను ఆరా తీస్తున్నారు. శనగ, వేరుశనగ, కందులు, పెసర, నువ్వులు, జొన్న, పొద్దుతిరుగుడు, రాగులు తదితర పంటల సాగులో పెట్టుబడులు, దిగుబడులు, ఆదాయాన్ని రైతులు విశ్లేషిస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
యాసంగి వడ్లను కేంద్రం కొనబోమని తేల్చిచెప్పటంతో కొద్దిరోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. క్లస్టర్స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన సదస్సుల ద్వారా యాసంగి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు సూచనలు చేస్తున్నారు. పంట మార్పిడి వల్ల భూసారం పెరగనుందని, చీడపీడలు తగ్గనున్నాయని చెబుతున్నారు. పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, శనగ, పెసర, వేరుశనగ, మినుము, జొన్న, కందులు, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర ప్రత్యామ్నాయ పంటలను ఇప్పుడు సాగుచేయవచ్చని, అనువైన వాతావరణం ఉందని పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వీటిలో ఏవి ఎక్కడ లభిస్తాయనే వివరాలను రైతులకు తెలియజేస్తున్నారు. యాసంగిలో సాగు చేయాల్సిన ప్రత్యామ్నాయ పంటల విత్తనాల రకాలు, వీటిని ఎకరంలో ఎంత మోతాదులో వేయాలనేది వివరిస్తున్నారు. వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు కూడా గ్రామాలను సందర్శించి ప్రత్యామ్నాయ పంటల్లో ఏది ఏ సమయంలో వేయాలో రైతులకు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ఊరూరా ప్రత్యామ్నాయ పంటలసాగు, విత్తన రకాలు, దిగుబడులు, ప్రభుత్వ మద్దతు ధరలపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.
మద్దతు ధరలకు మించి..
పంట ఉత్పత్తులకు ప్రభుత్వం ఇటీవల మద్దతు ధరలను ప్రకటించింది. వీటిలో వరిని పక్కకు పెడితే ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, జొన్న, పెసర, కందులు, మినుములు, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటల ప్రభుత్వ మద్దతు ధరలపై రైతులు చర్చించుకుంటున్నారు. 2021-22 సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్ జొన్న(హైబ్రీడ్)కు రూ.2,738, జొన్నకు రూ.2,758, పెసర్లు రూ.7,275, మినుములు రూ.6,300, వేరుశనగ రూ.5,550, పొద్దుతిరుగుడు రూ.6,015, నువ్వులు రూ. 7,307, వెర్రి నువ్వులు రూ.6,930, సోయా బీన్ రూ.3,950, రాగులు రూ.3,377, సజ్జకు రూ. 2,250. గత 2020-21లో వీటి మద్దతు ధర క్వింటాల్ జొన్న(హైబ్రీడ్)కు రూ.2,620 ఉంటే దీనిపై ఈఏడాది రూ.118, కందులకు రూ.6వేలు ఉంటే, ప్రస్తుతం అదనంగా మరో రూ.300 పెరి గింది. అత్యధికంగా నువ్వులకు క్వింటాల్కు రూ. 452 పెరగటం విశేషం. 2020-21లో క్వింటాల్ నువ్వులకు రూ.6,855 ఉంటే, ఈఏడాది ఇది రూ.7,307కు ఎగబాకింది. వేరుశనగ మద్దతు ధర క్వింటాల్కు రూ.275 పెరిగింది. 2020-21లో క్వింటాల్ వేరుశనగ మద్దతు ధర రూ.5,275 ఉంటే ఇప్పుడిది రూ.5,550కి పెరగటం గమనార్హం. మినుముల ధర కూడా క్వింటాల్కు రూ.300 పెరిగింది. గత ఏడాది క్వింటాల్కు రూ.6వేలు ఉండగా ఈ ఏడాది రూ.6,300కు ఎగబాకింది. పెసర్ల మద్దతు ధర క్వింటాల్కు గత సంవత్సరం ధరపై రూ.79 పెరిగింది. ఇక క్వింటాల్ మీడియం పత్తికి ధర గత ఏడాది రూ.5,515 ఉండగా, ఇప్పుడిది రూ.5,726కు చేరింది. లాంగ్ పత్తికి గత ఏడాది రూ.5,825 ఉంటే, ఈఏడాది ఇది రూ.6,025కి పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం పత్తితోపాటు ఇతర ప్రత్యా మ్నాయ పంట ఉత్పత్తులకు ధర ప్రభుత్వ మద్దతు ధరకు మించి పలుకుతోంది. డిమాండ్ ఉండటం వల్ల కొన్ని పంట ఉత్పత్తులను వ్యాపారులు రైతుల కల్లాలు, ఇండ్ల వద్దే కొంటున్నారు.