వనపర్తి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పండిన వరిని కొనుగోలు చేసేలా మోడీ సర్కార్ను అడుగడుగునా నిలదీయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. గురువారం పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజాప్రతినిధులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగి సీజన్లో పండిన ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ధ్వజమెత్తారు. మోడీ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా కదిలిరావాలని పిలుపునిచ్చారు. వానకాలంలో పండిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని, యాసంగి వరిని మాత్రం కేంద్రం కొనాలన్నారు. తెలంగాణ రైతులను ఈ దిశగా జాగృతం చేయాలని సూచించారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభు త్వం వివక్ష కనబరుస్తున్నదని విమర్శించారు. ధా న్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని ఒప్పించలేని రాష్ట్ర బీజేపీ నేతలు తమ తప్పు బయటపడకుండా ఇక్కడి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. పంజాబ్కు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. రైతులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి భాగస్వామ్యం కావాలన్నారు. కేంద్రం కుటిల నీతిని, బీజేపీ దుష్ప్రచారాన్ని పల్లెపల్లెకూ తెలియజేయాలని కోరారు.