న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల స్థిరత్వంపై ఆర్బీఐ ఆందోళన విశ్వసించదగిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.ఆర్థిక స్థిరత్వం పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ కట్టుబడి ఉన్నాయని సోమవారం మీడియాతో అన్నారు. క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్తో తలెత్తే పరిణామాలపై ఆర్బీఐ తన ఆందోళనను ప్రభుత్వం ద్రుష్టికి తెచ్చిందన్నారు.
ప్రతిపాదిత క్రిప్టో కరెన్సీ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం వేచి చూస్తున్నదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇంతకుముందు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సారధ్యంలోని వివిధ శాఖల కార్యదర్శుల కమిటీ.. క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్, పర్యవసనాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే వర్చువల్ కరెన్సీ మినహా.. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.