హైదరాబాద్/ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ) అమలుతో భారత్ విశ్వగురుగా ఎదుగుతుందని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ‘జాతీయ విద్యా విధానం-2020 (ఎన్ఈపీ) అమలు – ఉన్నత విద్యాసంస్థల్లో వ్యూహాలు’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును గవర్నర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ నుంచి ఏటా 10 లక్షల మంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారని, ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే వారు 50 వేలు మాత్రమే ఉన్నారని అన్నారు. ఎన్ఈపీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే మనదేశం విశ్వగురుగా ఎదుగుతుందని చెప్పారు. అటు.. కొవిడ్ నేపథ్యంలో తెలంగాణలో ఆన్లైన్ బోధన బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. ఆన్లైన్ క్లాసులను విజయవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, వర్సిటీ వైస్ చాన్స్లర్లను ఆమె అభినందించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విద్యార్థులకు టెక్నాలజీ పరిజ్ఞానం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. టీచింగ్లోనూ బోధన విధానం మెరుగుపడాలని అన్నారు. ప్రపంచపటంలో భారత నిపుణులది ప్రత్యేక స్థానమని గవర్నర్ అన్నారు. మన విద్యార్థుల ప్రతిభతో అనేక దేశాలు, అంతర్జాతీయ సంస్థలు లాభ పడుతున్నాయని చెప్పారు.
పరిశ్రమలకు తగ్గట్టు రాష్ట్రంలో కరిక్యులం: ప్రొఫెసర్ లింబాద్రి
జాతీయ విద్యా విధానం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొన్నదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) పెరిగిందని చెప్పారు. జీఈఆర్లో జాతీయ సగటు 26 కాగా, రాష్ట్రంలో 35 శాతంగా ఉన్నదని తెలిపారు. ఏఐ, ఎంఎల్, ఐవోటీ, రోబోటిక్, బ్లాక్చైన్, డాటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరంలో 24 వేల సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. బీఏ ఆనర్స్ కొత్తగా ప్రవేశపెట్టామని వివరించారు.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు ఉన్నతవిద్య కరిక్యులంలో మార్పులు చేర్పులు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధే, ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్, కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ, యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ జేపీ సింఘాల్, ఎన్ఈపీ జాతీయ సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ కిషన్, ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ రమణారావు, రాష్ట్రంలోని వివిధ వర్సిటీల వీసీలు తదితరులు పాల్గొన్నారు.