Virat kohli 100th test match | టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీకి.. బీసీసీఐ ఆఖరి అవకాశంగా తన కెరీర్ వందో టెస్టులో నాయకత్వం వహించే ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారథిగా నిలిచిన విరాట్ దాన్ని తనదైన శైలిలో తిరస్కరించినట్లు తెలుస్తున్నది. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ పరాజయం అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ నాయకత్వానికి విరాట్ కోహ్లీ టాటా చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా..
తాజాగా వందో టెస్టులో సారథ్యం వహించమని విరాట్ను బీసీసీఐ అధికారి ఫోన్లో సంప్రదించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏడేండ్ల నాయకత్వంలో జట్టుకు ఎన్నో మధుర విజయాలు అందించిన కోహ్లీ.. బోర్డు ప్రస్తావనను తిరస్కరించినట్లు సమాచారం. వీడ్కోలు మ్యాచ్ వంటిది ఏర్పాటు చేయడానికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేయగా.. ‘ఒక్క మ్యాచ్తో ఏమీ మారదు. నేను అలాంటివి కోరుకునేవాడిని కాదు’ అని కోహ్లీ కరాఖండిగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఐదు నెలల్లో కోహ్లీ కెప్టెన్సీ విషయంలో పలు మార్పులు సంభవించిన విషయం తెలిసిందే.
రవిశాస్త్రి వెళ్లడంతోనే..
గత కొన్నేళ్లుగా భారత క్రికెట్లో తిరుగులేని శక్తిగా వ్యవహరించిన కోహ్లీకి టీ20 ప్రపంచకప్ నుంచే ఎదురుగాలి ప్రారంభమైంది. మెగాటోర్నీ ప్రారంభానికి ముందు పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ.. జట్టు పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే వెనుదిరగడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో తనకు ఇన్నాళ్లు అండగా ఉంటూ వచ్చిన రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి వైదొలగడంతో బోర్డులో కోహ్లీకి వ్యతిరేక పవనాలు ప్రారంభమయ్యాయి. పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న కోహ్లీని.. బోర్డు అధికారులు వన్డే సారథ్యం నుంచి తొలగించారు. ఈ అంశంపై బోర్డు చెప్పిన అంశాలకు విరుద్ధంగా విరాట్ మాట్లాడగా.. ఇప్పుడు సఫారీ గడ్డపై సిరీస్ ఓడటంతో బోర్డు ఎలాంటి చర్య తీసుకోక ముందే విరాట్ తన నిర్ణయాన్ని ప్రకటించాడనేది స్పష్టమవుతున్నది.