మంచాల, నవంబర్ 2 : మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ లోయపల్లి అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంతో పాటు ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామ రూపురేఖలు మారాయి. స్వచ్ఛతకు మారు పేరుగా మారింది. పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో లోయపల్లిలో సకల సౌకర్యాలు కల్పించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 1.50కోట్ల నిధులతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. సీసీరోడ్లు, భూగర్భడ్రైనేజీలు, వైకుంఠధామం, వర్మీ కంపోస్టుయార్డు నిర్మించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పల్లెప్రకృతి వనంతో పాటు గ్రామంలో విరివిగా మొక్కలు నాటారు. ప్రతి వార్డులో పంచాయతీ సిబ్బంది శుభ్రం చేయడం, చెత్తాచెదారం తొలగిస్తున్నారు. వీధుల్లో వీధి దీపాలు కనిపిస్తున్నాయి.
పూర్తి అయిన పనులు..
పల్లెప్రగతిలో భాగంగా లోయపల్లిలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేశారు. రూ.18 లక్షలతో వైకుంఠధామం, రూ. 2లక్షలతో పల్లెప్రకృతి వనంలో 4వేల మొక్కలను పెంచడం, రూ.2లక్షలతో వర్మీ కంపోస్టు యార్డు నిర్మాణ పనులు పూర్తి, రూ.9లక్షల 40వేలతో చెత్త సేకకరణ, మొక్కలకు నీరు పోసేందుకు ట్రాక్టర్తో పాటు ట్యాంకర్ను ఏర్పాటు చేసుకున్నారు. రూ. 95 లక్షలతో గ్రామంలోని ప్రతి వీధిలో సీసీరోడ్లు నిర్మించారు. ప్రతి వీధిలో స్తంభాలకు ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకున్నారు.
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా..
లోయపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడమే కాకుండా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కృషి, ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. గతంలో కంటే గ్రామం చాలా అభివృద్ధి చెందింది. ప్రతి కాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీ వేయించాం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకం.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామాలు స్వచ్ఛతలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. లోయపల్లిలో ప్రతి రోజూ పంచాయతీ సిబ్బందితో రోడ్లు శుభ్రం చేయించడం, మొక్కలకు నీటిని అందించడంతో పాటు ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాం. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా లోయపల్లి గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తున్నాం.