మొహాలీ: టాపార్డర్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ (123 బంతుల్లో 139; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్-‘సి’లో భాగంగా గురువారం జరిగిన పోరులో హైదరాబాద్ 79 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. తిలక్ వర్మతో పాటు చందన్ సహాని (87; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) రాణించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 246 పరుగులకే పరిమితమైంది. హిమ్మత్ సింగ్ (47) టాప్ స్కోరర్ కాగా.. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3, సీవీ మిలింద్, కార్తీకేయ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
రుతురాజ్ మోత..
యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే టోర్నీలో శతకాల మోత మోగిస్తున్నాడు. తొలి మ్యాచ్లో సెంచరీతో కదం తొక్కిన రుతురాజ్ (143 బంతుల్లో 154 నాటౌట్; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) గురువారం ఛత్తీస్గఢ్తో జరిగిన పోరులో అజేయ ఇన్నింగ్స్తో మహారాష్ట్రను గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఛత్తీస్గఢ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 275 పరుగులు చేయగా.. రుతురాజ్ దూకుడుతో మహారాష్ట్ర 47 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మరోవైపు కేరళతో పోరులో యువ పేస్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (84 బంతుల్లో 112; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు సెంచరీ కొట్టడంతో మధ్యప్రదేశ్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. విదర్భతో జరిగిన పోరులో ఆంధ్రప్రదేశ్ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (93), అంబటి రాయుడు (53) రాణించారు. ఛేజింగ్లో అథర్వ (123 బంతుల్లో 164 నాటౌట్; 15 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో విదర్భ 41.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 288 పరుగులు చేసింది.