లాక్డౌన్ తర్వాత విడుదలైన భారీ చిత్రాల్లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప-ది రైజ్’ ఒకటి. విడుదలైనప్పుడు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ నెమ్మదిగా ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. సరిగా ప్రమోషన్స్ చేయకపోయినా హిందీలో కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది.
ఈ సినిమా రెండో పార్ట్ ‘పుష్ప-ది రూల్’ ఈ ఏడాది వస్తుందని మొదటి నుంచి చిత్రబృందం చెప్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. సుకుమార్ ఇదే విషయంపై మాట్లాడుతూ అసలు ఈ చిత్రాన్ని వెబ్ సిరీస్గా తీయాలని అనుకున్నట్లు వెల్లడించాడు.
కానీ ఫుల్ లెంగ్త్ మూవీ తీస్తేనే బాగుంటుందని మేకర్స్ భావించడంతో రెండు భాగాలుగా సినిమా తీయాలని నిర్ణయించారు. తాజాగా సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఇప్పటి వరకూ కూడా పుష్ప రెండు పార్ట్ల గురించే సుకుమార్ మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉన్నట్లు విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. ‘హ్యాపి బర్త్డే సుకుమార్ సర్. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీతో సినిమా ప్రారంభించే రోజు కోసం వెయిట్ చేయలేకపోతున్నా’ అంటూ ట్వీట్ చేశాడు.
అక్కడితో ఆగితే ప్రాబ్లం ఏమీ లేదు. ఆ కిందే ‘2021-ది రైజ్, 2022-ది రూల్, 2023-ది ర్యాంపేజ్’ అంటూ బాంబు పేల్చాడు. దీంతో పుష్ప సిరీస్లో మూడో చిత్రం కూడా ఉందని ప్రచారం జోరందుకుంది. కాగా, సుకుమార్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్య, ఆర్య-2 చిత్రాల క్రమంలోనే ఆర్య-3 కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.