బ్యాడ్మింటన్ దిగ్గజమైన ప్రకాశ్ పదుకొనె వల్ల కాలేదు!జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్కూ సాధ్య పడలేదు!! ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో ఇప్పటి వరకు అసలు తుది పోరుకే అర్హత సాధించలేకపోయిన భారత్.. ఈసారి అద్భుతాన్ని ఆవిష్కరించింది.బ్యాడ్మింటన్లో ప్రపంచకప్నకు సమానమైన మెగా టోర్నీలో తొలిసారి టైటిల్ పట్టిన టీమ్ఇండియా నయా చరిత్ర లిఖించింది! గతంలో మాదిరి ఒంటరి పోరాటాలు కాకుండా.. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన భారత్.. ఫైనల్లో 14 సార్లు చాంపియన్ ఇండోనేషియాను మట్టికరిపించి విజేతగా నిలిచింది!
సింగిల్స్ పోరులో లక్ష్యసేన్ అదిరిపోయే బోణీ కొడితే.. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట విజృంభించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మూడో మ్యాచ్లో ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ అదరగొట్టడంతో.. బ్యాడ్మింటన్ చరిత్రలోనే టీమ్ఇండియా అత్యున్నత విజయాన్నందుకుంది. నయా చరిత్ర లిఖించిన జట్టు సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కలుస్తానని ప్రకటిస్తే.. కేంద్ర క్రీడా శాఖ, భారత బ్యాడ్మింటన్ సంఘం చెరో కోటి రూపాయల నజరానా ప్రకటించాయి!!
బ్యాంకాక్: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో నయా శకానికి నాంది పడింది. ఏడు దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న థామస్ కప్ను భారత పురుషుల జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3-0తో 14 సార్లు చాంపియన్ ఇండోనేషియాను చిత్తు చేసి సగర్వంగా తొలి టైటిల్ ముద్దాడింది. మొదట సింగిల్స్ పోరులో లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16తో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆంటోని గింటింగ్పై విజయం సాధించి 1-0తో ఆధిక్యం అందించగా.. డబుల్స్ పోరులో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 18-21, 23-21, 21-19తో మహమ్మద్ ఎహ్సాన్-కెవిన్ సంజయ ద్వయంపై గెలుపొందింది.
ఈ రెండు మ్యాచ్ల్లోనూ తొలి గేమ్లో పరాజయాలు ఎదురైన అనంతరం మనవాళ్లు అద్భుత పోరాటం కనబర్చారు. లక్ష్యసేన్ గంటా ఐదు నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేస్తే.. సాత్విక్ జంట గంటా 13 నిమిషాల్లో ఇండోనేషియా జోడీని మట్టికరిపించింది. మూడో పోరులో శ్రీకాంత్ 21-15, 23-21తో జోనాథన్ క్రిస్టీపై గెలుపొందడంతో భారత శిబిరంలో సంబురాలు అంబరాన్నంటాయి. తుదిపోరుకు చేరే క్రమంలో మలేషియా, డెన్మార్క్ను చిత్తు చేసిన భారత్.. ఫైనల్లో అదే జోష్ కొనసాగించింది. ఈ విజయం ఇచ్చిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని ప్లేయర్లు పేర్కొన్నారు.
కరోనా కారణంగా రెండేండ్లకు పైగా టోర్నీలకు దూరమైన భారత షట్లర్లు ఇటీవలి కాలంలో ప్రత్యర్థులపై ఆకలిగొన్న సింహాల్లా విరుచుకుపడుతుంటే.. భారత క్రికెట్పై 1983 ప్రపంచకప్ విజయం ఎంతటి ప్రభావం చూపిందో.. ఈ గెలుపు బ్యాడ్మింటన్పై అంతకుమించిన ఎఫెక్ట్ చూపుతుందని పురుషుల జట్టు కోచ్ విమల్ కుమార్ అభిప్రాయపడ్డాడు.
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన పురుషుల జట్టుకు భారీ నజారానాలు లభించాయి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రూ.కోటి, భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ మరో కోటి నగదు బహుమతి ప్రకటించారు. ‘మలేషియా, డెన్మార్క్, ఇండోనేషియాలపై వరుస విజయాలు సాధించడం అసాధారణమైన విషయం. తొలిసారి థామస్ కప్ను ముద్దాడిన జట్టుకు రూ.కోటి నగదు బహుమతి ప్రకటించడం గర్వంగా ఉంది’ అని ఠాకూర్ ట్వీట్ చేశారు. ‘ఇది యావత్ దేశం గర్వించదగ్గ రోజు. వ్యక్తిగతంగా ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ.. థామస్ కప్ మాత్రం చాలా ప్రత్యేకం’అని బాయ్ అధ్యక్షుడు, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు.
భారత బ్యాడ్మింటన్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. థామస్ కప్ విజయంతో దేశం మొత్తం గర్విస్తున్నది. విజేతగా నిలిచిన జట్టుకు శుభాకాంక్షలు. ఈ విజయం భావి క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలి.
– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
భారత బ్యాడ్మింటన్లో ఈ విజయం జోష్ నింపింది. సమిష్టి ప్రదర్శనకు దక్కిన అత్యుత్తమ ఫలితమిది. నమ్మకం, విశ్వాసం, కఠోర శ్రమ వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి. ఈ టైటిల్ గురించి అభిమానుల్లో చాన్నాళ్ల పాటు చర్చలు కొనసాగుతాయి.
– పుల్లెల గోపీచంద్, జాతీయ కోచ్
73 ఏండ్ల చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి విజయం సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు. మీరందరూ దేశానికి గర్వకారణం. దేశాన్ని అత్యున్నతంగా నిలుపడంలో ఇదే కృషి కొనసాగించండి.
– హిమంత బిశ్వశర్మ, బాయ్ అధ్యక్షుడు, అస్సాం సీఎం