హైదరాబాద్, జనవరి 24: గ్రామ పంచాయతీ నిధుల వినియోగానికి సంబంధించిన చెక్కులపై సంతకాలు చేయకుండా పదే పదే నిరాకరిస్తూ, పనుల్లో జాప్యానికి కారణమవుతున్న ఉప సర్పంచ్ల చెక్ పవర్కు కత్తెర వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. గ్రామసభ తీర్మానం ద్వారా మరో వార్డు సభ్యుడికి చెక్ పవర్ను అప్పగించే వెసులుబాటును ఆయా పంచాయతీలకు అప్పగించింది. చెక్కులపై సంతకాలు పెట్టడానికి ఉప సర్పంచ్లు నిరాకరిస్తే, వారి స్థానంలో మరొక వార్డు సభ్యుడికి అధికారాలు అప్పగించేందుకు గ్రామసభ తీర్మానం చేయాల్సి ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శరత్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే, జిల్లా కలెక్టర్ ఆమోదించిన తరువాతే గ్రామసభ చేసిన తీర్మానం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ నిధుల వినియోగానికి సంబంధించిన చెక్కులపై గ్రామ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే పలు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్లు సంతకాలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. దీంతో అనేక రకాల బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి. పనుల్లో జాప్యం జరుగుతున్నది. ఈ సమస్యను ఇటీవల జరిగిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ సమీక్షా సమావేశంలో జిల్లా ప్రజా ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.