అమీర్పేట్, డిసెంబర్ 8: నిండు జీవితాన్ని అర్థవంతంగా గడిపిన దివంగత మాజీ సీఎం రోశయ్య తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం అమీర్పేట డీకే రోడ్డులోని రోశయ్య నివాసానికి చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ విలువలకు కట్టుబడిన వ్యక్తి రోశయ్యని కొనియాడారు. ఆయన ఏ పదవిలో ఉన్నా ప్రజా సమస్యలపై లోతైన అధ్యయనం చేసేవారని అన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నా సమకాలీక రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించుకునే వారమని రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. పరామర్శించిన వారిలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా, కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఉన్నారు.