ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వీయనిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చిన ఈ చిత్రం కథా అభివ్యక్తిలో నృత్యభూమికను అర్థవంతంగా ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటున్నది. ఈ సినిమాను వీక్షించిన ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నాట్యకళ గొప్పతనాన్ని తెలియజెప్పింది. భారతీయ సంస్కృతిలో కళల ప్రాధాన్యతను కళ్లకు కడుతూ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు రేవంత్తో పాటు చిత్రబృందాన్ని అభినందిస్తున్నా’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ సినిమాపై సీనియర్ నటుడు బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. ‘ఇది గొప్ప కళాఖండం. మరుగున పడిపోతున్న కళలు, సంస్కృతులకు జీవం పోసి భావితరాలకు అందించే ప్రయత్నం చేశారు’ అని ఆయన అభినందించారు.