అక్టోబర్ 1 నుంచే అమల్లోకి.. పెరుగనున్న కనీస వేతనం
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్లు, భవన నిర్మాణం, గనులు, వ్యవసాయ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు (సెంట్రల్ స్పియర్ వర్కర్లు) కేంద్ర కార్మిక శాఖ శుభవార్త చెప్పింది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ (వీడీఏ) పెంచుతున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీంతో 1.5 కోట్ల ఉద్యోగులకు కనీస వేతనం పెరుగనున్నట్టు వివరించింది. ‘కరోనా సంక్షోభంతో దేశం కుదేలైంది. ఈ క్రమంలో సెంట్రల్ స్పియర్లోని పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఊరట కలిగించేందుకు వీడీఏను పెంచుతున్నాం. అక్టోబర్ 1 నుంచే ఇది అమల్లోకి వస్తుంది’ అని కార్మికశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు, రైల్వేలు, గనులు, చమురు క్షేత్రాలు, ప్రధాన పోర్టులు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో పని చేసేవారికి ఈ పెంపు వర్తిస్తుంది. ఈ రేట్లు కాంట్రాక్టు, క్యాజువల్ ఎంప్లాయీస్, వర్కర్లకు కూడా వర్తిస్తాయి. పారిశ్రామిక కార్మికుల కోసం సగటు వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా వీడీఏ సవరించారు.