వ్యవసాయ యూనివర్సిటీ: వయ్యారిభామ అనే కలుపు మొక్క పంటకు చాల ప్రమాదకారి అని, తెలంగాణలో దీనిప్రభావం అధికంగా ఉందని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ నరేందర్ రెడ్డి, అఖిలభారత సమన్వయ కలుపు నివారణ విభాగం అథిపతి డా.రామ్ప్రకాశ్ అన్నారు. మంగళవారం కళాశాల అవరణలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కలుపు మొక్క అన్ని నేలల్లో ఏపుగా పెరుగుతుందన్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని నల్ల, ఎర్ర, చౌడు, ఇసుక నేలల్లో మెట్ట, మాగాణిలలో అధికంగా పెరుగుతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సాగు నీరు అధికంగా అందుబాటులోకి తీసుకు రావడంతో, పంటలసాగు ఘణనీయంగా పెరిగిందన్నారు. ఈ సారి దక్షిణ, ఉత్తర తెలంగాణలోనూ విడతల వారిగా కురిసిన వానలకు మెట్ట పంటలు 40-60 రోజుల దశలో, వరి వారం నుంచి రెండు వారాల దశలో ఉందన్నారు. రైతు నిర్లక్ష్యం చేస్తే అదే స్థాయిలో వయ్యారిభామ పెరుగుతుందని , పూత దశ రాకముందే తొలగించాలన్నారు. వయ్యారిభామ కలుపు మొక్క కలిగించే అనార్ధాలు పంట నష్టం , నివారణ మార్గాలపై వివరించారు.
ఆయాగ్రామాలలో ని రైతులకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు సైతం అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కాలేజీ ఫారం అధిపతి డా.సయ్యద్హుస్సెన్, ప్రధాన శాస్త్రవేత్త డా. బి. పద్మజ, కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగ అధికారులు డా. అరుణ, శైలజ, శకుంతల తదితరులు పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. అంతకు ముందు కళాశాల ఆవరణలో , ఫామ్ ప్రాంతంలో వయ్యారిభామను తొలగించారు.