హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టునీడలో..! స్టూడెంట్ నంబర్ వన్ సినిమాలో సూపర్హిట్ పాట ఇది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన యూనివర్సిటీలపై విద్యార్థులకు ఎనలేని ప్రేమ, మమకారం ఉంటుంది. అలాంటి చదువుల తల్లి రుణం తీర్చుకోవడానికి ప్రతి విద్యార్థి పరితపిస్తాడు. విద్యాలయాలకు పూర్వవిద్యార్థులే గొప్ప ఆస్తి. యూనివర్సిటీల బలోపేతానికి పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకునేందుకు ఉన్నత విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పూర్వ విద్యార్థులకోసం ప్రతి వర్సిటీలో ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విభాగం అధికారులు పూర్వ విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంబంధాలు నెరపనున్నారు. గ్రంథాలయాల డిజిటలైజేషన్, ప్రయోగశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, గెస్ట్ ఫ్యాకల్టీగా బోధన, సెమినార్లు, కాన్ఫరెన్స్ల నిర్వహణకు అలుమ్ని సహకారాన్ని వినియోగించుకోనున్నారు. ఇదే అంశంపై బుధవారం ఉన్నత వి ద్యామండలి అధికారులు అన్ని వర్సిటీల వైస్చాన్స్లర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు. అలుమ్నీ సేవలను విద్యార్థుల సమగ్రాభివృద్ధికి వినియోగించుకోవాలని వీసీలకు సూచించారు.
పూర్వ విద్యార్థులంతా ఒకే గూటికి.
పూర్వ విద్యార్థులందరిని ఒకే గూటికి చేర్చేందుకు ‘చాన్స్లర్ కనెక్ట్స్ అలుమ్ని’ పేరుతో ఓ పోర్టల్ ను రాజ్భవన్వర్గాలు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. ఈ వెబ్సైట్లో పూర్వ విద్యార్థుల రిజిస్ట్రేషన్లపై గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉస్మానియా, జేఎన్టీయూ సహా పలు విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న వారంతా అమెరికా సహా దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. వీరందరిని ఒక గొడుగుకిందికి తీసుకొచ్చేందుకు ఈ పోర్టల్ను వినియోగించుకోనున్నారు. వర్సిటీలవారీగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు సమ్మేళనాలు నిర్వహిస్తుండగా ఇకపై ఇందుకు వర్సిటీలు చొరవతీసుకోనున్నాయి.