(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టు వీడటం లేదు. ప్రపంచ దేశాలపై తాను విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ట్రంప్ కొత్తదారులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో సుంకాలకు సంబంధించి ‘సెక్షన్ 301’ అస్ర్తాన్ని బయటకు తీశారు. భారత్తో పాటు 16 దేశాలపై దర్యాప్తును చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు అమెరికా వాణిజ్యశాఖ ప్రతినిధి జెమిసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు.
ఇతర దేశాలు అనుసరిస్తున్న అభ్యంతరకర వాణిజ్య విధానాలను సవాలు చేసేందుకు అమెరికాకు అపరిమిత అధికారాలను కల్పించే ఉద్దేశంతో 1974 వాణిజ్య చట్టంలో సెక్షన్ 301ను పొందుపరిచారు. ఒక్కసారి ఈ సెక్షన్ ప్రయోగిస్తే.. తమ వాణిజ్య భాగస్వాములైన దేశాలు అనుసరిస్తున్న ట్రేడ్ పాలసీలపై దర్యాప్తు చేసేందుకు అమెరికాకు అధికారం లభిస్తుంది. అంతేకాదు, ఏదైనా దేశం తమ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ట్రేడ్ పాలసీలను అనుసరిస్తుందని సదరు దర్యాప్తులో తేలితే.. ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి లేకుండానే సదరు దేశంపై అమెరికా ఏకపక్షంగా చర్యలు తీసుకొనే అధికారాన్ని ఈ సెక్షన్ కల్పించింది. అంటే ఆయా దేశాలపై చట్టబద్ధంగా భారీ సుంకాలు విధించడం గానీ ప్రతీకార చర్యలు తీసుకోవడానికి అమెరికాకు మార్గం సుగమమవుతుంది.
‘సెక్షన్ 301’ కింద 16 దేశాలపై దర్యాప్తు చేపట్టనున్నట్టు గ్రీర్ తెలిపారు. ఈ జాబితాలో భారత్తో పాటు చైనా, యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయ్లాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్, బంగ్లాదేశ్, మెక్సికో, జపాన్ దేశాలు ఉన్నాయి.
సుంకాల నుంచి ఉపశమనం పొందేందుకు అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకొన్నామని కేంద్రం గతంలో పేర్కొంది. దేశీయ రైతులకు నష్టం జరుగుతుందని సర్వత్రా విమర్శలు వ్యక్తమైనప్పటికీ పట్టించుకోలేదు. ట్రేడ్ డీల్ను ఓ చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించింది. అయితే, ట్రేడ్ డీల్ చేసుకొన్న భారత్పైనే ఇప్పుడు అమెరికా దర్యాప్తునకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి. మోదీ ప్రభుత్వ దౌత్యం విఫలమయ్యిందంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.