సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. నగరంలోని హరితప్లాజాలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సంబంధించిన అంశాలు, జిల్లాలో రక్షణ, లా అండ్ ఆర్డర్, మహిళా సంక్షేమంపై చర్చించారు. అలాగే ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం, సర్వ శిక్షాభియాన్ పథకాలపై ఆరా తీశారు.
సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో 85 పీహెచ్సీలు, 133 బస్తీ దవాఖాలను పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ అయిన వారికి కేసీఆర్ కిట్ ఇస్తుండటంతో 2017 నుంచి ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. టీబీ నిర్మూలనలో హైదరాబాద్ ఉన్నత స్థానంలో ఉందని చెప్పారు. ఏరియా, జిల్లా దవాఖానల్లో కొవిడ్ టెస్టు, నాన్ కొవిడ్ టెస్టులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీధి వ్యాపారులకు లోన్లు మంజూరు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆయా శాఖల అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ సీఈవో అభిజిత్రెడ్డి, పోలీస్ జాయింట్ కమిషనర్ అవినాశ్ మహంతి, జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.