Upasana | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అశేష ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ అందిపుచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పుడు ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది.
ఇదిలా ఉండగా, రామ్ చరణ్ భార్య ఉపాసన తన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తోంది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) వైస్ ఛైర్పర్సన్గా సేవలు అందిస్తున్న ఆమెను ఇటీవలే తెలంగాణ స్పోర్ట్స్ హబ్కు కో ఛైర్పర్సన్గా నియమితులయ్యారు.. తల్లిగా క్లీంకార ఆలనా పాలనా చూసుకుంటూనే తన ప్రొఫెషనల్ లైఫ్తో బిజీగా ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసింది.
ఈ సందర్భంగా తన భర్త రామ్ చరణ్ గురించి చెప్పిన విషయం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సెలబ్రిటీలు తరచూ ఫోన్ నంబర్స్ మారుస్తూ ఉండటం సర్వసాధారణం. రామ్ చరణ్ అయితే ఈ విషయంలో సరికొత్త రికార్డే సృష్టించాడని చెప్పాలి. ఉపాసన చెప్పిన ప్రకారం, చరణ్ ఇప్పటివరకు 199 సార్లు తన మొబైల్ నంబర్ మార్చుకున్నాడు. ప్రస్తుతం వాడుతున్నది ఆయన 200వ నెంబర్ అని తెలిపింది. అందుకే, తన ఫోన్లో భర్త పేరు “రామ్ చరణ్ 200”గా సేవ్ చేసుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా, సెలబ్రిటీలకి ఇన్ని తలనొప్పులు ఉంటాయా అని కొందరు నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.