కాన్పూర్: యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న రాకేశ్ సచన్పై .. అక్రమ ఆయుధం కలిగి ఉన్న కేసులో ఏడాది జైలు శిక్ష ఖరారు అయ్యింది. ఆయనకు రూ.1500 ఫైన్ కూడా విధించారు. అయితే రెండు రోజుల క్రితం కాన్పూర్ కోర్టులో గమ్మత్తు జరిగింది. 1991, ఆగస్టు 13 నాటి కేసులో మంత్రిని కోర్టు దోషిగా తేల్చింది. అక్రమ రీతిలో రైఫిల్ కలిగి ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. అయితే కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని మంత్రి రాకేశ్ .. కోర్టు రిజిస్టర్ నుంచి లాక్కెళ్లినట్లు తెలిసింది. కోర్టు ఫైల్ను మంత్రి రాకేశ్ ఎత్తుకెళ్లినట్లు రీడర్ కామిని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ వద్ద ఫిర్యాదు చేసింది. ఇక సోమవారం రోజున మంత్రి రాకేశ్ కోర్టు ముందు ప్రత్యక్షం అయ్యారు. ఫైల్ తీసుకువెళ్లినట్లు మీడియా తనను చిత్రీకరించిందని, కానీ దాంట్లో వాస్తవం లేదన్నారు. శిక్షా కాలం మూడేళ్ల లోపు ఉన్న కారణంగా.. 50 వేల బాండ్పై మంత్రి రాకేశ్కు బెయిల్ మంజూరీ చేశారు.