అలహాబాద్: అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ అందక ఆస్పత్రిలో రోగులు చనిపోవడం నరమేధంతో సమానమని ఉత్తర ప్రదేశ్ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్నో, మీరట్ జిల్లాల్లో ఆక్సిజన్ లేని కారణంగా కరోనా రోగులు చనిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై కోర్డు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి, క్వారంటైన్ కేంద్రాల పరిస్థితిపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు సిద్ధార్థ వర్మ, అజిత్ కుమార్ తో కూడిన ధర్మాసనం ఈ ఘటనలపై దర్యాప్తునకు ఆదేశించింది.
కేవలం ఆక్సిజన్ సరఫరా లేనందువల్ల రోగులు చనిపోవడం బాధాకరమని తెలిపింది. ఈ మరణాలు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నిరంతరం సరఫరా అయ్యేలా చూడాల్సిన అధికారులు జరిపిన నరమేధం తప్ప మరోటి కావని ధర్మాసనం మండిపడింది. శాస్త్రవిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెంది గుండెమార్పిడులు,మెదడు శస్త్రచికిత్సలు జరుగుతున్న ఈరోజుల్లో మనుషులు చనిపోతుంటే ఎలా వదిలేస్తామని విస్మయం వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలవు చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. ఆక్సిజన్ సరఫరా లోపానికి సంబంధించిన వార్తలపై లక్నో, మీరట్ జిల్లా మేజిస్ట్రేట్లు 48 గంటల్లో దర్యాప్తు జరిపి తదుపరి విచారణ సందర్భంగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.