బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ తుది అంకానికి చేరుకుంది. రసవత్తరంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ల్లో యూపీ యోధ, బెంగళూరు బుల్స్ అద్భుత విజయాలతో సెమీ ఫైనల్కు దూసుకెళ్లాయి. సోమవారం యూపీ యోధ 42-31తో పుణేరి పల్టన్పై విజయం సాధించగా.. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 49-29తో గుజరాత్ జెయింట్స్ను ఓడించి సెమీస్ బెర్త్ను దక్కించుకున్నాయి. తొలి ఎలిమినేటర్ పోరులో యూపీ యోధుడు పర్దీప్ నర్వాల్ 18 పాయింట్లతో రెచ్చిపోగా.. అస్లామ్ (10), ఆకాశ్ (7) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రెండో ఎలిమినేటర్లో బెంగళూరు బుల్ పవన్ షెరావత్ (13) విజృంభించగా.. రంజిత్ (7), భరత్ (6)తో పాటు మిగతా రైడర్లు తలా కొంత స్కోర్ నమోదు చేయగా.. గుజరాత్ తరఫున రాకేశ్ (8), మహేంద్ర (5) రాణించారు. బుధవారం జరుగనున్న సెమీ ఫైనల్లో టేబుల్ టాపర్ పట్నా పైరేట్స్తో యూపీ యోధ.. దబాంగ్ ఢిల్లీతో బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్లో ఏకైక విజయం సాధించిన తెలుగు టైటాన్స్ వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి లీగ్ దశను గట్టెక్కలేకపోయింది.