లక్నో : కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చినట్లు ప్రాసిక్యూషన్ అడ్వకేట్ ఎస్పీ యాదవ్ తెలిపారు. లఖింపూర్ హింస కేసులో ఆశిష్ మిశ్రాను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం కోర్టు విచారణ జరిపింది. హింస ఘటన అనంతరం శనివారం రాత్రి పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి శనివారం విచారణకు హాజరవగా.. సుమారు 12 గంటల పాటు పోలీసులు విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో ఆశిష్ మిశ్రాకు వైద్య పరీక్షలు చేయించి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు యాదవ్ పేర్కొన్నారు.