హైదరాబాద్ : నీట్( NEET ) ప్రశ్నాపత్రం లీక్ కావడానికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ( Minister Resignation ) చేయడం విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదుల విజయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ , ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ( Vaddiraju Ravichandra ) అన్నారు. కాక్రోచ్ సైన్యాన్ని చూసి దేశం గర్వపడుతున్నదని, విద్యార్థులు,యువత ఆగ్రహించి పోరుబాట పడితే,అది ఏ స్థాయిలో ఉంటుందో యావత్ ప్రపంచం మరోసారి చూసిందని పేర్కొన్నారు.
ఎన్ని ఆంక్షలు విధించినా, బెదిరించినా, భయపెట్టినా, నిర్బంధాలు ప్రయోగించినా, లాఠీలెత్తినా, దేశద్రోహులు,సంఘ విద్రోహులు అని ముద్రవేసినా కూడా యువత వెనుకంజ వేయకుండా ఉద్యమించిందని అన్నారు. విద్యార్థుల పోరాటంలో న్యాయం ఉందని, ధర్మమైనదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించడాన్ని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.
విద్యార్థుల ధర్మమైన ఆగ్రహావేశాలకు పార్లమెంట్ గేట్లు కూడా మూసేయాల్సిన పరిస్థితి తలెత్తిందంటే వారి బలమెంతో పాలకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేస్తూ,దేశంలో ఇక ముందు ఎలాంటి పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా లీక్ కాకుండా, అక్రమాలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవలసిందిగా పాలకులకు హితవు పలికారు.