కంటోన్మెంట్/మారేడ్పల్లి, మార్చి 7: మహిళల సంక్షేమానికి కేంద్రం పెద్దపీట వేస్తున్నదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్లోని మడ్ఫోర్డ్లో నూతనంగా నిర్మించిన సఖీభవన్ను ఆంధ్ర, తెలంగాణ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ రాకేష్ మనోచా, కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ అధికారి సోమశేఖర్, సీఈఓ మధుకర్నాయక్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33% శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అనంతరం బోర్డు సీఈవో మధుకర్ నాయక్ మాట్లాడుతూ రక్షణ శాఖ ప్రత్యేక చొరవ తీసుకొని మహిళల సంక్షేమం కోసం సఖీ భవన్ను నిర్మించిందని తెలిపారు. ఒంటరిగా ఉంటూ ఉద్యోగాలు చేసుకునే మహిళలకు, ఇతర ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చిన మహిళలకు ఈ భవన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ భవన్లో మహిళలకు వసతి తో పాటు వైద్య సేవలను సైతం అందించనున్నామని ఆయన వివరించారు. వసతి గృహంలో ఉండే మహిళలకు 12 ఏండ్లలోపు పిల్లలు ఉంటే వారి ఆలనా పాలన చూసుకునేందుకు ఒక కేర్ టేకర్ను సైతం నియమిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించిన ఆయా విభాగాల అధికారులు గోపాలకృష్ణ దాస్, బాలకృష్ణ, మహేందర్, దేవేందర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రూ.5 కోట్ల వ్యయంతో పార్కుల అభివృద్ధి
అన్ని హంగులతో పార్కును అభివృద్ధి చేసి కాలనీ వాసుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ఐదో వార్డు మహేంద్రాహిల్స్లో రూ.5కోట్ల వ్యయంతో నాలుగు వేల చదరపు గజాలలో సకల సౌకర్యాలతో నిర్మించిన కంటోన్మెంట్ ఉద్యాన్ పార్కును గురువారం బోర్డు ప్రెసిడెంట్ కె. సోమశేఖర్, సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యుడు జే. రామకృష్ణ లతో కలిసి కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ పార్కులో ఓపెన్ జిమ్ ,చిల్డ్రన్ పార్కు ,స్కేటింగ్ స్టేడియం ,వాకింగ్ ట్రాక్, పచ్చదనం కలిగిన మైదానం స్థానిక ప్రజలకోసం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.