న్యూఢిల్లీ : లఖింపూర్ఖేరి హింసాత్మక ఘటనలో దర్యాప్తు చేస్తున్న సిట్ 14 మందిని నిందితులుగా పేర్కొంది. ఇందులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా బంధువు పేరు సైతం ఉన్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆయన తనయుడు ఆశి ష్ మిశ్రా. అక్టోబర్ 3న టికునియా పట్టణంలో చెలరేగిన హింసలో నలుగురు రైతులు, ఓ జర్నలిస్ట్ సహా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. అదే రోజురాత్రి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో 14 మందిని నిందితులుగా చేర్చారు. మరో వైపు ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లలో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారం 5వేల పేజీలతో చార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ క్రమంలో కేంద్రమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇప్పటికే విపక్షాలు కేంద్రమంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్లో సైతం కేంద్రమంత్రిని బర్తరఫ్ చేయాలని పట్టుబట్టాయి. ఈ క్రమంలో కేంద్రమంత్రి స్పందిస్తూ.. తన కుమారుడికి వ్యతిరేకంగా ఒక్క ఆధారమైనా ఉంటే రాజీనామా చేస్తానన్నారు. ‘సంఘటనా స్థలంలో నేనుగానీ, నా కొడుకుగానీ లేరనడానికి మా దగ్గర ఆధారాలున్నాయి. నా కొడుకు ఉన్నట్లు రుజువైతే ఇప్పుడే మంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అన్నారు.
ఇంతకు ముందు ఒక న్యూస్ చానల్తో మంత్రి మాట్లాడుతూ ‘కేసును న్యాయంగా దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ ద్వేషంతో నన్ను, నా కొడుకుని ఇరికిస్తున్నారు. నేను, నా కొడుకు సంఘటనా స్థలంలో లేము అని నిరూపించే అనేక ఆధారాలు మా వద్ద ఉన్నాయి. స్థలం, వేదిక నుంచి దూరం దాదాపు 4 కిలోమీటర్లు’ అన్నారు. ఇదిలా ఉండగా.. సిట్ దాఖలు చేసిన చార్జిషీట్లో అజయ్ మిశ్రా కుమారుడిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఈ క్రమంలో అజయ్ మిశ్రా రాజీనామాకు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగనున్నది.