హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : సాస్ (సాప్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) కంపెనీలకు దేశంలోనే హైదరాబాద్ అత్యంత అనువైన గమ్యస్థానం అని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాస్ స్టార్టప్ డార్విన్ బాక్స్.. యూనికార్న్ హోదాను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జయేశ్రంజన్ మాట్లాడుతూ గత కొన్నేండ్లుగా దేశంలో స్టార్టప్లు వేగంగా పురోగమిస్తున్నాయన్నారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నా తట్టుకొని నిలబడటంలో స్టార్టప్లు విజయవంతం అయ్యాయన్నారు. డార్విన్బాక్స్కు యూనికార్న్ హోదా రావడం గొప్పవిషయం అన్నారు. సాస్ కంపెనీలంటే కేవలం చెన్నై, మద్రాస్ మాత్రమే కాదని హైదరాబాద్లో ఈ రంగంలో దాదాపు 300 కంపెనీలు ఉన్నాయన్నారు. వీటిలో జెనోటి, హైరేడియస్ ఇప్పటికే యూనికార్న్ హోదా దక్కించుకోగా.. మూడో కంపెనీగా డార్విన్బాక్స్ ఆ ఘనత సాధించిందన్నారు.
ఎలాంటి ప్రోడక్ట్ తయారు చేయడానికైనా కావాల్సిన మౌలిక సదుపాయాలు హైదరాబాద్లో ఉన్నాయన్నారు. సాస్ కంపెనీలకు కావాల్సిన అనువైన వాతావరణం ఇక్కడ ఉందని స్పష్టం చేశారు. డార్విన్బాక్స్ ఆ విషయాన్ని నిరూపించి చూపిందన్నారు. సేల్స్పోర్స్, సీక్వోయా, లైట్స్పీడ్, ఎండియా పార్ట్నర్స్, 3వన్4క్యాపిటల్, ఎస్సీబీ, 10ఎక్స్ అండ్ జేజీడీఈవీ లాంటి ప్రముఖ సంస్థలు డార్విన్బాక్స్లో పెట్టుబడి పెట్టాయని చెప్పారు. డార్విన్ బాక్స్ కో-పౌండర్ చైతన్య పెద్ది మాట్లాడుతూ.. సౌత్ ఈస్ట్ ఆసియా, మధ్యతూర్పు దేశాలు, యూఎస్లలో కంపెనీని విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రానున్న ఏడాదిలో 1500 మంది హైదరాబాద్లో ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కో-పౌండర్లు జయంత్, రోహిత్, ఎండియా పార్ట్నర్స్ ఎండీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. డార్విన్బాక్స్ తాజాగా వివిధ ఇన్వెస్టర్ల నుంచి 72 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.537 కోట్లు) నిధుల్ని సమీకరించింది. దీంతో కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్ల స్థాయిని మించింది. ఒక బిలియన్ డాలర్ల విలువను పొందిన స్టార్టప్ను యునీకార్న్గా వ్యవహరిస్తారు.
డార్విన్బాక్స్ వ్యవస్థాపకులకు అభినందనలు: మంత్రి కేటీఆర్ ట్వీట్
డార్విన్బాక్స్ యునికార్న్ హోదా సాధించడంపై మంత్రి కేటీఆర్ ‘హైదరాబాద్ నుంచి మరో యునికార్న్. డార్విన్బాక్స్ యునికార్న్ అయ్యింది. చైతన్య పెద్ది, జయంత్, రోహిత్, ఎండియా వీసీలకు నా అభినందనలు. ఈ మార్గంలో మరెన్నో వస్తాయని నేను కచ్చితంగా చెప్పగలను’ అని ట్వీట్ చేశారు.