హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కరోనాతో దేశం అల్లకల్లోలం అవుతున్నది. పేదలకు చేసేందుకు పని లేదు. చదువుకొన్నవారికి ఉద్యోగం లేదు. ఇలాంటి సమయంలో కోట్లమంది కొండంత ఆశలుపెట్టుకొన్న కేంద్ర బడ్జెట్ ఆకలితో అలమటిస్తున్న సగటు పౌరుడి నోట్లో మట్టికొట్టింది. బీజేపీ సర్కారు ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామన్న హమీకి తిలోదకాలిచ్చి, ఇప్పుడు ఏటా 12 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కొత్త పాట అందుకొన్నది. ప్రస్తుతం దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగేనని కేంద్రప్రభుత్వమే రెండురోజుల క్రితం పార్లమెంటు ముందు పెట్టిన ఆర్థిక సర్వే కుండబద్ధలు కొట్టింది. యువత ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారని ఘోషించింది. అత్యంత కీలకమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు మోదీ సర్కారు కనీస ఆసక్తి చూపలేదని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. కూలీ పనైనా చేసుకొని బతుకుదామన్నా కష్టమేనని తేలిపోయింది.
ఐదేండ్లలో 60 లక్షల కొలువులా..
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండేది 2024 వరకు. అప్పడు జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్నది ఇప్పడే చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం బీజేపీకి దేశవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తున్నది. ఇది ఇలాగే ఉంటే మోదీ ఇంటికి పోవటం ఖాయం. కానీ, బడ్జెట్లో మాత్రం రాబోయే ఐదేండ్లల్లో 60 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. ఇది ప్రజలను మోసం చేయటమేనని మేధావులు మండిపడుతున్నారు. ఏదు రాష్ర్టాల ఎన్నికల్లో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు సంఖ్యను ఎక్కువచేసి చూపటానికే 60 లక్షల ఉద్యోగాలని ఊదరగొట్టారని విమర్శిస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి జిమ్మికులు చేయటం బీజేపీకి అలవాటేనని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
ఉద్యోగులపై కక్షసాధింపు: టీజీవో
ఆదాయపు పన్ను పరిమితిని మార్చకపోవడాన్ని ఉద్యోగులపై కక్షసాధింపు చర్యగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) అభివర్ణించింది. పన్ను రాయితీ కల్పిస్తారని ఆశించిన ఉద్యోగులకు బడ్జెట్లో కేంద్రం మొండిచేయి చూపించిందని టీజీవో అధ్యక్షురాలు వీ మమత విమర్శించారు. ఏడేండ్ల క్రితం నిర్ణయించిన కనీస ఆదాయ పరిమితిని ఇంకా కొనసాగించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. మంగళవారం టీజీవో నేతలతో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగి రెండు నెలల వేతనాన్ని ఆదాయపన్ను రూపంలో కేంద్రానికే చెల్లించాల్సి రావడం బాధిస్తున్నదని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ఉద్యోగులపై వివక్ష చూపడమేనని మండిపడ్డారు. సమావేశంలో టీజీవో నేతలు ఏ సత్యనారాయణ, పీ రవీందర్రావు, ఎస్ సహదేవ్, టీ రవీందర్రావు, బీ వెంకటయ్య, అరుణ్కుమార్, జీ వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణాయాదవ్, టీ లక్ష్మణ్గౌడ్, డాక్టర్ హరికృష్ణ, సబిత, పరమేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గత పదేండ్లలో యూపీఏ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికొదిలేసింది. బీజేపీకి అధికారమిస్తే ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తాం.
ఏటా 12 లక్షల చొప్పున వచ్చే ఐదేండ్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
-2022-23 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
కరోనా, ఆర్థిక మందగమనం తదితర కారణాలతో దేశంలో నిరుద్యోగిత తీవ్రంగా పెరిగిపోయింది. ప్రస్తుతం దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు.
-2021-22 ఆర్థిక సర్వే.
కేంద్రప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రస్తుతం దేశంలో 32.5 కోట్ల మంది నిరుద్యోగులున్నారు. మరి ఏటా 12 లక్షల ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయి? దేశంలో నిరుద్యోగ సమస్య ఎప్పటికి తీరుతుంది? ఏటా ఉన్నతవిద్యా సంస్థల నుంచి బయటకొచ్చే కోట్లమంది యువతకు ఎన్నటికి ఉద్యోగాలు దొరుకుతాయి?
కేంద్రప్రభుత్వం మంగళవారం
లోక్సభలో ప్రవేశపెట్టిన 2022-23 ఏడాది బడ్జెట్ చూసిన తర్వాత ఇదీ సామాన్యుడి ప్రశ్న.