హైదరాబాద్: వరల్డ్ క్రికెట్లో ఇండియాకు ఘనతను తీసుకువచ్చిన క్షణాలకు 39 ఏళ్లు నిండాయి. కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్ కప్ టైటిల్ను ఎగురేసుకుపోయి నేటితో 39 ఏళ్లు. ఏమాత్రం ఆశలు లేని జట్టుగా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ నాటి జట్టు.. అనూహ్య రీతిలో దిగ్గజాలను ఓడించి 1983 వరల్డ్ కప్ ట్రోఫీని చేజిక్కించుకున్నది. కపిల్ దేవ్ తన నాయకత్వంతో భారత క్రికెట్ ప్రేమికులకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్లో అలనాటి మేటి జట్టు వెస్టిండీస్ను ఓడించడం అది మరిచిపోలేని క్షణమే. చాలా తక్కువ టార్గెట్ను ఇండియన్ బౌలర్లు డిఫెండ్ చేసిన తీరు అనిర్వచనీయం. ఇక లార్డ్స్ బాల్కనీలో వరల్డ్ కప్ ట్రోఫీని కపిల్ దేవ్ అందుకున్న ఆ క్షణాలను ఎవరూ మరిచిపోలేరు. ఇండియా తొలి వరల్డ్ కప్ గెలిచిన 39 ఏళ్లు గడిచిన సందర్భంగా ఐసీసీ తన ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టింది. కపిల్ నాయకత్వంలో ఇండియా వండర్ చేసినట్లు చెప్పింది.
India win their maiden World Cup 🇮🇳
On this day in 1983, Kapil Dev's team stunned the world by beating the mighty West Indies to lift the @CricketWorldCup 🏆
— ICC (@ICC) June 25, 2022
ఆ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 183 పరుగులకు ఆలౌటైంది. శ్రీకాంత్ అత్యధికంగా 38 రన్స్ చేశాడు. సందీప్ పాటిల్ 27 రన్స్ చేశాడు. గవాస్కర్(2), కపిల్దేవ్(15) బ్యాటింగ్లో ఫెయిలయ్యారు. కానీ బౌలింగ్లో ఇండియన్లు ఇరగదీశారు. టాప్ ఫామ్లో ఉన్న విండీస్ హిట్టర్ రిచర్డ్స్ను కేవలం 33 రన్స్కే ఔట్ చేశారు. కపిల్ దేవ్ అద్భుత రీతిలో రిచర్డ్స్ క్యాచ్ను అందుకున్నాడు. జెఫ్ డూజాన్ 25 రన్స్ చేశాడు. వెస్టిండీస్ 140 రన్స్కే ఆలౌటైంది. దీంతో ఇండియా 43 రన్స్ తేడాతో నెగ్గింది. అమర్నాథ్, మదన్లాల్ చెరో మూడేసి వికెట్లు తీసుకున్నారు.
ఇండియన్ క్రికెట్లో జూన్ 25వ తేదీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. 1932లో ఇదే రోజున భారత జట్టు తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ను ఆడింది. లార్డ్స్లో మన జట్టు ఇంగ్లండ్తో ఫస్ట్ టెస్ట్ ఆడడం విశేషం.