బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన లార్డ్ మౌంట్బాటన్, ఆయన సతీమణి ఎడ్వినా మౌంట్బాటన్కు చెందిన డైరీల్లోని రహస్యాలను బహిర్గతపర్చాలని బ్రిటిష్ రచయిత ఆండ్రూ లౌనీ కోర్టుకెక్కారు. బ్రిటన్ సమాచార హక్కు చట్టం ప్రకారం.. ఆ వివరాలను ఇవ్వాల్సిందేనని లౌనీ వాదించారు. అయితే బ్రిటన్ ప్రభుత్వం ఇందుకు నిరాకరిస్తున్నది. చట్టాలను ఉల్లంఘించినందుకు రూ.6 కోట్ల జరిమానా కట్టేందుకు కూడా సిద్ధమైంది. కానీ, డైరీలను మాత్రం బహిర్గతం చేయబోనన్నది. ఎందుకు? ఆ డైరీలో ఏ రహస్యాలు ఉండొచ్చు?
గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్య మహారాణి విక్టోరియా ముని మనుమడు లార్డ్ మౌంట్బాటన్. రాజకుటుంబానికి చెందిన వాడైనప్పటికీ, బ్రిటీష్ రాయల్ నేవీలో విధులు నిర్వహించేవారు. భారత్కు ఆఖరి వైస్రాయ్గా కూడా పనిచేశారు. 1922లో ఆయన భారత్లో ఉన్నప్పుడు ఎడ్వినా అనే మహిళతో పరిచయం ఏర్పడి అది వివాహానికి దారి తీసింది. అయితే, అనంతరం జరిగిన కొన్ని పరిణామాలతో వీళ్లిద్దరి మధ్య కొంత ఎడబాటు తప్పలేదు. ఈ సమయంలోనే కొన్ని కీలక రహస్యాలను ఈ దంపతులు డైరీల్లో రాశారు. అవే ‘మౌంట్బాటన్’ డైరీలుగా ఖ్యాతి పొందాయి.
మౌంట్బాటన్ దంపతులకు చెందిన డైరీల్లోని విషయాలు బయటకు వస్తే.. బ్రిటిష్ రాజకుటుంబ పరువు-ప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదమున్నదని, బ్రిటన్-పాకిస్థాన్-భారత్ మధ్య ఉన్న సంబంధాలు బలహీనపడుతాయని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తున్నట్టు ‘వియాన్’ సైట్ అభిప్రాయపడింది.
వైవాహిక జీవితంలో అరమరికలు వచ్చిన సమయంలో ఎడ్వినా.. భారత దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో సన్నిహితంగా మెలిగారని, అటు లార్డ్ మౌంట్బాటన్ కూడా మరొకరితో సంబంధాన్ని కొనసాగించినట్టు కూడా గతంలోనే వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన రహస్యాలే ఆ డైరీల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఎడ్వినా కూతురు పమేలా హిక్స్నీ కూడా తన పుస్తకం ‘డాటర్ ఆఫ్ యాన్ ఎంపైర్: లైఫ్ యాజ్ ఎ మౌంట్బాటన్’లో ఎడ్వినా-నెహ్రూ బంధాన్ని ప్రస్తావించారు. ‘నెహ్రూ, ఎడ్వినాల మధ్య అద్భుత అనుబంధం, పరస్పర గౌరవాభిమానాలు ఉండేవి. నెహ్రూ రాసిన లేఖల్లో అమ్మ గురించి ఆయన భావనలు చదివితే.. వారి మధ్య ప్రేమానుబంధాన్ని అర్థం చేసుకోవచ్చు.
తాను కోరుకున్న వ్యక్తిత్వం, మేధస్సును అమ్మ ఆయనలో చూసింది’ అని ఆమె వెల్లడించారు. కాగా, ప్రముఖ ఇంగ్లిష్ వార్తాపత్రిక ‘వియాన్’ ఇదే అంశంపై ఎడ్వినా-నెహ్రూ మధ్య నడిచిన కొన్ని లేఖలను ప్రచురించింది. తన నుంచి నెహ్రూ దూరంగా వెళ్లిపోవడాన్ని ఎడ్వినా భరించలేకపోయినట్టు ఓ లేఖలో ఉన్నది. జీవితం ఎంతో నిరాసక్తమైనదని నెహ్రూ బదులివ్వడం కూడా అందులో ఉన్నది. కాగా, ఈ డైరీల్లో భారత జాతిపిత మహాత్మాగాంధీ, పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా, 1947లో భారత్-పాక్ మధ్య సరిహద్దులను ఏర్పాటుచేసిన సర్ సిరిల్ రాడ్క్లిఫ్కు సంబంధించిన విషయాలు కూడా ఉన్నట్టు సమాచారం.