లండన్ : ప్రపంచంలోనే తొలిసారిగా వేగవంతమైన, సరళమైన ‘గ్యాలరీ’ రక్త పరీక్షకు బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) శ్రీకారం చుట్టింది. ఇది లక్షణాలు కనిపించే ముందు 50 రకాల క్యాన్సర్లను గుర్తించనుండగా.. బ్రిటన్ ఆరోగ్య సంరక్షణ సంస్థ గ్రెయిల్ ట్రయల్స్ను ప్రారంభించింది. గ్యాలరీ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను పరిశీలిస్తుంది. ఎంత మేరకు పని చేస్తుందో పరీక్షించేందుకు ఇంగ్లాండ్లోని ఎనిమిది ప్రాంతాల్లో 1,40,000 మంది వలంటీర్ల నియమించాలని నేషనల్ హెల్త్ సర్వీస్ లక్ష్యంగా పెట్టుకున్నది.
‘గ్యాలరీ పరీక్ష విస్తృత రకాల క్యాన్సర్ రకాలను గుర్తించడమే కాకుండా, శరీరంలో అధిక స్థాయిలో క్యాన్సర్ ఎక్కడ ఉందో ఖచ్చితత్వంతో అంచనా వేస్తుందని గ్రెయిల్ యూరోప్ భారత సంతతి అధ్యక్షుడు హర్పాల్ కుమార్ పేర్కొన్నారు. ప్రాణాంతక క్యానర్లను గుర్తించడంలో ఈ పరీక్ష చాలా బలంగా ఉందని తెలిపారు. పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్హెచ్ఎస్తో పని చేయడం సంతోషంగా ఉందని, యూకేలో టెక్నాలజీని వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు.
ట్రయల్స్లో భాగంగా మొదట రిటైల్ పార్కులు, కమ్యూనిటీ స్థానాల్లో మొబైల్ టెస్టింగ్ క్లినిక్లో రక్త నమూనాలు తీసుకుంటారని.. త్వరిత, సరమైళన రక్త పరీక్ష ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ గుర్తింపు, చికిత్సలో ఒక విప్లవానికి నాంది పలుకుతుందని ఎన్హెచ్ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా ప్రిట్చార్డ్ అన్నారు. లక్షణాలకు ముందే క్యాన్సర్ను గుర్తించడం ద్వారా.. దానికి చికిత్స అందించేందుకు ఉత్తమ అవకాశం ఉంటుందన్నారు. గ్యాలరీ రక్త పరీక్ష విజయవంతమైతే నేషనల్ హెల్త్ సర్వీస్ లాంగ్ టర్మ్ ప్రణాళిక ఆశయాన్ని సాధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.
ప్రారంభ దశలో మూడొంతుల క్యాన్సర్లకు సులభంగా చికిత్స చేయవచ్చని అమండా తెలిపారు. తల, మెడ, ప్రేగు, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్, గొంతుక్యాన్సర్ వంటివి ప్రారంభంలో గుర్తించడం చాలా కష్టమన్నారు. ట్రయల్స్ ఫలితాలు 2023 నాటికి వెలువడుతాయని అంచనా వేస్తుండగా.. విజయవంతమైతే ఇంగ్లాండ్లో 2024-2025 నాటికి మరో మిలియన్ మందికి విస్తరించాలని నేషనల్ హెల్త్ సర్వీస్ యోచిస్తోంది. ఇప్పటికే ఎన్హెచ్ఎస్ పదివేల మందిని నమూనాలను ఇవ్వాలని ఆహ్వానిస్తూ లేఖలు పంపింది.
గత మూడు సంవత్సరాల్లో క్యాన్సర్ నిర్ధారణ చేయని పార్టిసిపెంట్స్ను స్థానికంగా ఉండే మొబైల్ క్లినిక్లో బ్లడ్ శాంపిల్ సేకరించి.. మళ్లీ 12 నెలల తర్వాత మరోసారి టెస్టులకు పిలుస్తారు. రెండు సంవత్సరాల మరోసారి నమూనాలు సేకరిస్తారు. ఈ విప్లవాత్మక కొత్త పరీక్ష లక్షణాలు కనిపించక ముందే క్యాన్సర్లను గుర్తించగలదని, ప్రజలకు వ్యాధిని ఓడించే ఉత్తమ అవకాశాన్ని ఇస్తుందని యూకే ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ అన్నారు. నేషనల్ హెల్త్ సర్వీస్ గ్యాలరీ టెస్ట్ను యూకే క్యాన్సర్ రీసెర్చ్, కింగ్స్ కాలేజీ లండన్ క్యాన్సర్ ప్రివెన్షన్ ట్రయల్స్ యూనిట్, ఎన్హెచ్ఎస్ హెల్త్కేర్ కంపెనీ గ్రెయిల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది.
గ్యాలరీ పరీక్ష గేమ్ ఛేంజర్ కావొచ్చని, ముఖమైన పరిశోధనకు నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని యూకే కింగ్స్ కాలేజీ లండన్ క్యాన్సర్ నివారణ ట్రయల్స్ యూనిట్ డైరెక్టర్, ట్రయల్స్ ముఖ్య పరిశోధకుడు ప్రొఫెసర్ పీటర్ ససియెని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బ్రిటన్లో కాన్సర్ మరణాల్లో ఐదోవంతు సర్వసాధారణంగా లంగ్ క్యాన్సర్ మూలంగానే సంభవిస్తున్నాయి. దేశంలో క్యాన్సర్ మరణాల్లో లంగ్, పేగు, ప్రొస్టేట్ కాన్సర్లతో కారణంగానే 45 శాతం మరణాలు నమోదవుతున్నాయని ఎన్హెచ్ఎస్ పేర్కొంది.