హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ).. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)తో కలిసి ‘యూనియన్ ఎంఎస్ఎంఈ రూపే క్రెడిట్ కార్డ్’ను విడుదల చేసింది. దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థవైపు పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ కార్డుతో ఎంఎస్ఎంఈలు 50 రోజులపాటు వడ్డీలేని రుణం అందించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా దీనికి ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు, వినియోగదారులు తమ కొనుగోళ్లకు వాయిదాల పద్దతిలో కార్డు ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చన్నారు. అలాగే రూ. 10లక్షల వరకు ప్రమాద బీమాతోపాటు రివార్డులు కూడా పొందవచ్చన్నారు.