కీవ్, ఫిబ్రవరి 19: ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఆయుధ సంపత్తిని పరీక్షించే ఉద్దేశంతో న్యూక్లియర్ డ్రిల్ చేపట్టేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదముద్ర వేశారు. బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులు, యుద్ధ విమానాలను శనివారం పరీక్షించినట్టు రష్యా సైనిక విభాగం తెలిపింది. ఈ విన్యాసాలను పుతిన్ స్వయంగా వీక్షించినట్టు వెల్లడించింది. ఉక్రెయిన్ మంత్రి డేనిస్ శనివారం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఉన్న ప్రాంతానికి కొంత దూరంలోనే ఫిరంగుల వర్షం (మోటార్ షెల్స్) కురిసినట్టు అధికారులు తెలిపారు.
మరోవైపు, రష్యాకు మద్దతిస్తున్న వేర్పాటువాదులు శనివారం జరిపిన దాడుల్లో ఇద్దరు ఉక్రెయిన్ సైనికులు మరణించారు. తూర్పు ఉక్రెయిన్లో ఈ ఘటన జరిగింది. ఇదే ప్రాంతంలో శుక్రవారం జరిగిన పేలుళ్లలో మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డట్టు వెల్లడించారు. ఇంకోవైపు, ఉక్రెయిన్పై ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో రష్యా మద్దతిస్తున్న వేర్పాటువాదులు మరింతగా రెచ్చిపోయారు. తూర్పు ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో బలగాల మోహరింపునకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చేవారం ఉక్రెయిన్పై రష్యా దాడిచేయబోతున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ అంచనా వేశారు. రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలపై రష్యాదళాలు విరుచుకుపడొచ్చని పేర్కొన్నారు.
దాడిచేస్తే ఊహించని రీతిలో ఆంక్షలు: కమలా హ్యారిస్
ఉక్రెయిన్పై దాడి చేస్తే ఊహించని రీతిలో ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్పై దాడి చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నారంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే కమలా హ్యారిస్ రష్యాకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఒకవేళ ఉక్రెయిన్పై దాడి జరిగితే రష్యాపై నాటో ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఒకవైపు చెబుతూనే.. దౌత్యపరమైన మార్గాలను మూసేస్తున్నదని ఆరోపించారు.