కొల్లం (కేరళ), అక్టోబర్ 13: రెండోపెండ్లికి అడ్డుగా ఉన్నదని కట్టుకున్న భార్యను పాముకాటుతో చంపిన సూరజ్ ఎస్ కుమార్కు కేరళలోని సెషన్స్ కోర్టు బుధవారం రెండు జీవితఖైదులను విధించింది. అలాగే, బాధితురాలిపై విషప్రయోగం చేసినందుకు, సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించినందుకు గానూ దోషికి మరో 17 ఏండ్లు జైలు శిక్షను విధించింది. దోషి ముందుగా 17 ఏండ్ల జైలుశిక్షను పూర్తిచేసిన తర్వాత రెండు జీవితఖైదులను ఒకేసారి అనుభవించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘ఇది అత్యంత అరుదైన కేసు. దీనికి దోషికి మరణశిక్ష విధించాలి. అయితే అతని వయస్సు (28 ఏండ్లు)ను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు, గతంలో అతనికి నేరప్రవృత్తి ఉన్నట్టు ఆధారాలు లేకపోవడం వల్ల జీవితఖైదుతో సరిపెడుతున్నాం’ అని న్యాయస్థానం వెల్లడించింది. దోషికి 5.85 లక్షల జరిమానాను కోర్టు విధించింది. అయితే, న్యాయస్థానం తీర్పుతో తాను సంతృప్తిగా లేనని, దోషికి మరణశిక్ష విధించాలని బాధితురాలు ఉత్రా తల్లి పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
కేరళలోని కొల్లంకు చెందిన సూరజ్కు, ఉత్రాకు రెండేండ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. పెళ్లయ్యాక కొన్నాళ్లు బాగానే ఉన్న సూరజ్.. ఆ తర్వాత మరో మహిళను వివాహం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీనికి ఉత్రా అడ్డుచెప్పింది. దీంతో తన చేతులకు మట్టి అంటకుండా ఉత్రాను అడ్డు తొలగించుకోవాలని భావించిన అతను.. గతేడాది మేలో పాములు పట్టే వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఓ నాగుపామును తీసుకున్నాడు. నిద్రపోతున్న ఉత్రాపై దాన్ని విసిరేశాడు. పాము రెండుసార్లు కాటువేయడంతో ఉత్రా నిద్రలోనే మరణించింది. అయితే, ఉన్నట్టుండి ఉత్రా మరణించడం, గతంలో కూడా ఆమెను ఒకసారి పాము కరవడంపై అనుమానాలు వ్యక్తం చేసిన బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. సోమవారం వాదనలు విన్న కోర్టు సూరజ్ను దోషిగా నిర్ధారించింది. బుధవారం శిక్ష ఖరారు చేసింది.