సికింద్రాబాద్, జనవరి 2 : విహార యాత్ర విషాదం నింపింది. ఆహ్లాదాన్ని పంచిన అలలు.. మృత్యుకెరటాలయ్యాయి. సముద్రంలో స్నానానికి దిగిన నగరానికి చెందిన ముగ్గురు అలల తాకిడికి కొట్టుకుపోయారు. ఒకరు విగతజీవిగా మారగా, ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం విశాఖ ఆర్కే బీచ్లో చోటుచేసుకుంది.
గతనెల 30న..
సికింద్రాబాద్ పరిధిలోని రసూల్పుర 105 గల్లీకి చెందిన స్నేహితులు చండి శివ(24), కె. శివ(21), అజీజ్(22), వినోద్(24), మధు (19), పవన్(19), సిద్ధు (19), కార్తిక్ (22) గతనెల 30న విహారయాత్ర కోసం వైజాగ్ కు వెళ్లారు. ఆదివారం సికింద్రాబాద్కు బయలుదేరేందుకు రైలు టిక్కెట్లు లేకపోవడంతో సోమవారం ఉదయం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ లోపు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో వీరంతా కలిసి.. ఆర్కే బీచ్కు వెళ్లారు. స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. అలల ఉధృతికి అజీజ్, చండి శివ, కె.శివ కొట్టుకుపోయారు. అప్రమత్తమైన లైఫ్ గార్డ్స్ సిబ్బంది శివను ఒడ్డుకు తీసుకొచ్చారు. వైద్యశాలకు తీసువెళ్లి.. చికిత్స అందించే లోపే అతడు మరణించాడు. గల్లంతైన కె.శివ, అజీజ్ కోసం గాలిస్తున్నారు.
బాధిత కుటుంబసభ్యులకు పరామర్శ
విశాఖ బీచ్లో విషాద ఘటన నేపథ్యంలో రసూల్పుర 105 గల్లీలోని బాధిత కుటుంబాలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో పాటు రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి పరామర్శించారు. ఈ విషాద ఘటనను క్రిషాంక్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచనతో వైజాగ్ అడిషనల్ డీసీపీ మనీశ్ సిన్హాతో ఫోన్లో మాట్లాడారు.
అండగా ఉంటాం
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి భరోసా ఇచ్చారు. కన్నీరుమున్నీరైన బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం ఎమ్మెల్యే సాయన్న కలెక్టర్తో పాటు అధికారులతో ఫోన్లో మాట్లాడి సమాచారాన్ని తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులను విశాఖకు పంపించే ఏర్పాట్లు చేశారు.