న్యూఢిల్లీ: టీవీల ధరలు మళ్లీ పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఒక్కో టెలివిజన్పై కనీసం రూ.2000-3000 వరకు పెరుగవచ్చునని వ్యాపార, పరిశ్రమ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే గత 8 నెలలుగా టీవీల ధరలు దాదాపు రూ.3000 నుంచి రూ.4000 వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో మరోసారి పెంచేందుకు సంస్థలు సిద్ధమయ్యాయి. కాగా, టీవీల ధరలు అంతకంతకూ పెరిగిపోవడానికి కారణం ప్యానెల్స్ (ఓపెన్ సెల్) ధరలు అధికంగా ఉండటమే.
టెలివిజన్ తయారీలో అత్యంత కీలకమైన ఈ ప్యానెల్స్ ధర క్రమంగా పెరుగుతున్నది. గతంతో పోల్చితే ప్యానెల్స్ ధర రెండింతలకుపైగా పెరిగింది. విదేశాల నుంచి సరఫరా కొరతే ఇందుకు ప్రధాన కారణం అని ఆయా సంస్థలు చెప్తున్నాయి. ఇక కస్టమ్స్ సుంకం పెంపు కూడా టీవీల ధరలను ఎగదోస్తున్నది. మరోవైపు కాపర్, అల్యూమినియం, స్టీల్ ధరలకూ రెక్కలు తొడగడం.. ఎగిసిన నౌక, విమాన రవాణా చార్జీలు సైతం టెలివిజన్ల ధరల పెంపునకు దారి తీస్తున్నదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
టీవీలను పీఎల్ఐ స్కీంలోకి తేవాలి
టీవీల తయారీని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీం) కిందకు తేవాలని ఆయా స్థానిక ఉత్పత్తిదారులు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. దేశీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో టెలివిజన్ల అమ్మకాల వాటానే 85 శాతానికిపైగా ఉన్నది. దీంతో వివిధ దేశాల ప్రముఖ సంస్థలన్నీ భారత్కు క్యూ కడుతుండగా, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో టీవీలను తయారు చేస్తున్నాయి.
ఈ క్రమంలో పీఎల్ఐ స్కీం వర్తింపజేస్తే దేశీయంగా ఉత్పత్తి మరింత పుంజుకుంటుందని, ధరలు కూడా తగ్గి కొనుగోళ్లు ఇంకా జరుగుతాయని భారత్లో థామ్సన్, కొడాక్ స్మార్ట్ టీవీల తయారీకి అనుమతి ఉన్న సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అవ్నీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. కాగా, సమ్మర్ కావడం, ఐపీఎల్ సీజన్ కూడా వస్తుండటంతో టీవీలకు మార్కెట్లో పెద్ద ఎత్తునే డిమాండ్ ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
రెడ్మీ బ్రాండ్లో స్మార్ట్ టీవీలు
దేశీయ మార్కెట్కు రెడ్మీ బ్రాండ్పై స్మార్ట్ టీవీలను పరిచయం చేయాలని షియామీ చూస్తున్నది. ఇప్పటికే భారత మార్కెట్లో షియామీ (ఎమ్ఐ) స్మార్ట్ టీవీలకు భారీగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్లో మరింత విస్తరించేందుకు రెడ్మీ బ్రాండ్ దోహదం చేయగలదన్న విశ్వాసాన్ని షియామీ కనబరుస్తున్నది.
తాము వ్యూహాత్మకంగా తెస్తున్న రెడ్మీ స్మార్ట్ టీవీలకూ భారీగానే ఆదరణ కనిపించవచ్చునని సంస్థ చెప్తున్నది. దేశీయ మార్కెట్లో 32 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు షియామీ 9 రకాల స్మార్ట్ టీవీలను అమ్ముతుండగా.. వీటి ధరల శ్రేణి రూ.14,499ల నుంచి రూ.54,999 వరకున్నది.