డిచ్పల్లి, నవంబర్ 26: తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం హైదరాబాద్లోని రూసా భవనంలో విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించ నున్నారు. సమావేశానికి హాజరుకావాలని పాలక మండలి సభ్యులకు సమాచారం అందింది. గత నెల 30న తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనాభవనంలో నిర్వహించిన సమావేశంలో ఎజెండా అంశాలు పూర్తి స్థాయిలో చర్చకు రాకుండానే అక్రమ నియామకాలు, ప్రమోషన్ల వివాదంతో సమావేశం ముగిసింది. పాలకమండలి సభ్యుల సలహాలు సూచనల మేరకు వీసీ రవీందర్ గుప్తా చేపట్టిన అక్రమ నియామకాలతో పాటు ప్రమోషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేరోజు ఇన్చార్జి రిజిస్ట్రార్ను సైతం తప్పించి యా దగిరిని నియమించిన విషయం తెలిసిందే. నేడు జరిగే సమావేశంలో యూనివర్సిటీకి సంబంధించి అన్ని విభాగాల అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. గతనెల 30న పాలకమండలి సమావేశం ముగిసిన నాటి నుంచి వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాలక మండలిని రద్దు చేయాలని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎజెండా అంశాలు ఇవే..!
గత పాలకమండలి సమావేశంలో ఎజెండా అం శా లు చర్చకు రాకపోవడంతో నేడు జరిగే సమావేశంలో అవే అంశాలు చర్చించనున్నట్లు సమాచారం. 2014లో నియామకమైన అధ్యాపకుల కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రమోషన్ల అంశం, టీయూలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి కేటగిరి మారుస్తూ వేతనాల పెంపు, పరీక్షల విభాగానికి కార్గో వాహనం కొనుగోలు, ఆర్గానిక్ కెమిస్ట్రీలో పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్లకు జీవో 11ను వర్తింపజేయడం, 2014లో విధుల్లో చేరిన వారికి పెన్షన్ స్కీం అమలు, ప్రభుత్వ జీవోలు అమలు తదితర విషయాలను ఎజెండా అంశాలుగా చేర్చినట్లు తెలిసింది.
అయితే 2014 నియామకాలపై హైకోర్టులో కేసు నడుస్తుండడంతో గత పాలకమండలి సమావేశంలో ఈ అంశాన్ని తిరస్కరించారు. నేడు జరుగనున్న పాలకమండలి సమావేశంలో 2014లో బోధనా సిబ్బంది ప్రమోషన్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని వర్సిటీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, యూనివర్సిటీ వీసీ రవీందర్గుప్తా, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి, పాలకమండలి సభ్యులు మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నసీం, నాగరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కే రవీందర్రెడ్డి, మారయ్య గౌడ్, పి.గంగాధర్ గౌడ్, వి.వసుంధరాదేవి, ఎం.రాజేందర్, ఎన్ఎల్ శాస్త్రి, ప్రవీణ్ కుమార్ హాజరుకానున్నారు.