సౌత్జోన్ గోల్ఫ్ చాంపియన్షిప్లో అమూల్య 76 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది
తొర్రూరు, మార్చి 25: గోల్ఫ్..ధనవంతుల క్రీడ! పట్టణాలకు పరిచయమైన ఈ ఖరీదైన ఆటలో సామాన్యులను అంతగా ఊహించుకోలేం. పచ్చిక బయళ్లలో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడే ఈ ఆట ఇప్పుడిప్పుడే సామాన్యులకు చేరువవుతున్నది. మనసు పెట్టి ఆడితే ఎందులోనైనా అదరగొట్టగలమని నిరూపిస్తున్నారు మన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు. చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు. క్రికెట్, ఫుట్బాల్, సాఫ్ట్బాల్, హ్యాండ్బాల్ లాంటి క్రీడలకే పరిమితం గాకుండా గోల్ఫ్లోనూ ఇరుగదీస్తున్నారు. తాజాగా కోలార్(కర్ణాటక) వేదికగా కేంద్ర యువజన, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సౌత్జోన్ గోల్ఫ్ చాంపియన్షిప్లో తొర్రూరు గురుకుల విద్యార్థి అమూల్య పసిడి పతకంతో మెరిసింది.
ప్రస్తుతం నార్సింగి గురుకుల పాఠశాలలో శిక్షణ పొందుతున్న అమూల్య 76 పాయింట్లతో అంచనాలకు మించి రాణించి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో పాటు ఈ నెల 21 నుంచి 23 వరకు కర్ణాటకలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఈ గిరిజన బిడ్డ రూ.25 వేల విలువ చేసే గోల్ఫ్ కిట్ను బహుమతిగా దక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల శివారు ఎర్రసోమ్ల తండాకు చెందిన అమూల్య అద్భుత ప్రదర్శన పట్ల ప్రిన్సిపాల్ జయశ్రీ, పీఈటీలు కుసుమ, రజిని హర్షం వ్యక్తం చేశారు. గురుకుల ఆర్సీవో ప్రత్యూష ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జయశ్రీ మాట్లాడుతూ సౌత్జోన్ గోల్ఫ్ పోటీల్లో అదరగొట్టిన అమూల్యకు గొప్ప భవిష్యత్ ఉందన్నారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు.