హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండానే శబరిమల భక్తులు ఆర్టీసీ స్పెషల్ బస్సులను బుక్ చేసుకోవచ్చని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇప్పటికే పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బస్సులను అద్దెకు తీసుకునే వారికి డిపాజిట్లు రద్దు చేసిన సజ్జనార్, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. అయ్యప్ప భక్తులు ఎవరైనా శబరిమలకు వెళ్లేందుకు అవసరమైన బస్సులను తమ దగ్గరలోని డిపోల మేనేజర్ల వద్ద బుక్ చేసుకోవచ్చని సూచించారు. జిల్లాలవారీగా ఆయా డిపోల మేనేజర్లు ఇప్పటికే దీనిపై ప్రచారం కల్పించేందుకు కరపత్రాలను సైతం పంపిణీ చేస్తున్నారు.