హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): వివిధ దేశాల్లో కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నదని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ వైద్యసేవలకు పెద్దపీట వేశారని కొనియాడారు.
ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీసెస్ ఇన్ వేరియస్ డిజాస్టర్స్ అంశంపై డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఎర్రోళ్ల హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే రాష్ట్రం వైద్యరంగంలో అద్భుత ప్రగతిని సాధిస్తున్నదని వెల్లడించారు. వైద్యరంగంలో దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్శాఖ, అగ్నిమాపకశాఖ, విద్యాశాఖ, జీహెచ్ఎంసీ శానిటరీ శాఖల అధికారులు పాల్గొన్నారు.