Donald Trump : అమెరికాలోని వాషింగ్టన్ డీసీ (Washington DC) లో అత్యంత పటిష్ట భద్రత నడుమ జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్ (Correspondents Dinner Meet) లో ఒక్కసారిగా తుపాకీ మోతలు మోగడం కలకలం రేపింది. ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు వందలాదిగా హాజరైన ఈ ప్రతిష్టాత్మక విందులో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటం అందరినీ షాక్కు గురిచేసింది. ఈ అనూహ్య ఘటన నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో సహా ప్రముఖులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ట్రంప్ వైట్ హౌస్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు.
కాల్పుల ఘటనను అమెరికా రాజ్యాంగంపై జరిగిన దాడిగా ట్రంప్ అభివర్ణించారు. ఘటన గురించి ట్రంప్, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద అనేక ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పగా.. ఘటనా స్థలంలో ఒక లాంగ్ గన్, తుపాకీ షెల్స్ లభ్యమైనట్లు కాష్ పటేల్ ధృవీకరించారు. అయితే నిందితుడి వద్ద ఉన్న ఆయుధాల గురించి మరిన్ని వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవని చెప్పారు. ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ తాను ఎంతో పదునైన ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నానని, కానీ ప్రస్తుత పరిస్థితులవల్ల తదుపరి కార్యక్రమంలో తన ప్రసంగం చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.
తాను ప్రసంగించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నానని, కానీ భద్రతాకారణాల దృష్ట్యా వచ్చేసారి చాలా సాదాసీదాగా వ్యవహరిస్తానని ట్రంప్ చెప్పారు. ఈ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ, భవిష్యత్తులో తాము ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన అన్నారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ వేదికపైనే ఉండాలని తాను గట్టిగా ప్రయత్నించానని, కానీ భద్రతాబలగాల సూచన మేరకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. ఈ కాల్పుల ఘటన ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. భద్రతా సిబ్బంది అత్యంత వేగంగా స్పందించిన తీరును ఆయన అభినందించారు.
‘సీక్రెట్ సర్వీస్ అద్భుతంగా స్పందించిందని, కాల్పులు జరిపిన వ్యక్తిని సీక్రెట్ సర్వీస్కు చెందిన కొందరు అదుపులోకి తీసుకున్నారని ట్రంప్ వెల్లడించారు. ఘటనలో పారదర్శకత, స్పష్టత కోసం తాను విడుదల చేయమని ఆదేశించిన ఒక టేప్ను ఇప్పుడే అధికారులు విడుదల చేశారని తెలిపారు. త్వరలోనే కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్ను తిరిగి నిర్వహిస్తామని చెప్పారు.