న్యూఢిల్లీ, జనవరి 2: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్ ’ కేసులకు కఠిన శిక్షల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను ట్రక్కు డ్రైవర్లు విరమించారు. డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్(ఏఐఎంటీసీ) ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్భల్లా మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు. చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, కొత్త నిబంధనలపై చర్చలు జరిపిన తర్వాతనే అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమణకు ఏఐఎంటీసీ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు సమ్మె విరమించాలని డ్రైవర్లకు పిలుపునిచ్చింది. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, ఏఐఎంటీసీతో చర్చలు జరిపిన తర్వాతనే కొత్త చట్టాన్ని అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని అసోసియేషన్ చైర్మన్ మల్కిత్ సింగ్ బాల్ పేర్కొన్నారు. అజయ్భల్లాతో సమావేశం అనంతరం సమ్మె విరమణను ప్రకటించిన ఏఐఎంటీసీ.. ట్రక్కు డ్రైవర్లు తిరిగి విధులకు వెళ్తారని ప్రకటించింది.
‘హిట్ అండ్ రన్’ కేసులకు కఠిన శిక్షలు ప్రతిపాదించడంపై ట్రక్కు డ్రైవర్లు భగ్గుమన్నారు. మూడు రోజుల సమ్మెలో భాగంగా మంగళవారం రెండో రోజు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కొత్త నిబంధనలు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా డ్రైవర్లు విధులు బహిష్కరించడంతో రవాణా కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల ఆందోళనలతో బండ్లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ర్టాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు. ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్, డీజిల్ పోయించుకొనేందుకు భారీగా క్యూలు కట్టారు. కొంత మంది అయితే ఆయిల్ కోసం బాటిళ్లు, క్యాన్లు తీసుకొచ్చారు. అకస్మాత్తు డిమాండ్తో ఉన్న నిల్వ అయిపోవడంతో బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. వాహనదారులు బంకులకు పోటెత్తడంతో.. ఆయా ప్రాంతాల్లో పెద్దయెత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోమవారం కూడా పలు రాష్ర్టాల్లోని ఆయిల్ బంకుల వద్ద ఈ విధమైన పరిస్థితి కనిపించింది. డ్రైవర్ల ఆందోళనలు కొనసాగితే రోజువారీ ప్రయాణాలు, నిత్యావసర సరుకుల రవాణా, పాఠశాలలపైనా ప్రభావం పడే అవకాశం ఉన్నది.
‘హిట్ అండ్ రన్’ కేసులో అధిక శిక్ష, జరిమానాలకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ర్టాల్లో డ్రైవర్లు ఆందోళనలు చేపట్టారు. ఇంధన డిపోల నుంచి బంకులకు ఆయిల్ను సరఫరా చేసే వేలాది మంది డ్రైవర్లు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో బంకులకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. మంగళవారం ఉదయానికే చాలా బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకొన్నాయి. ఉత్తర, పశ్చిమ రాష్ర్టాల్లో దాదాపు 2 వేల బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. సరఫరా లేకపోవడంతో చండీగఢ్లో ఆయిల్ పంపిణీపై అధికారులు పరిమితి విధించారు.
ద్విచక్రవాహనదారులకు గరిష్ఠంగా రెండు లీటర్లు, కార్లు, ఇతర వాహనాలకు ఐదు లీటర్ల వరకు మాత్రమే పోయాలని బంకు యాజమాన్యాలకు సూచించారు. హిమాచల్ప్రదేశ్లో డ్రైవర్ల ఆందోళనల ప్రభావం పర్యాటక రంగంపై పడింది. కొత్త చట్టానికి వ్యతిరేకంగా క్యాబ్ డ్రైవర్లు కూడా ఆందోళనలో పాల్గొనడంతో పర్యాటకులకు వాహనాలు దొరకడం లేదని స్థానిక మీడియా పేర్కొన్నది. డీజిల్ సరఫరా అగిపోతే, పాఠశాల బస్సులను కూడా నిలిపివేయాల్సి వస్తుందని మహారాష్ట్ర స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ గార్గ్ తెలిపారు. కాగా, డిమాండ్లను పరిశీలిస్తామన్న స్థానిక అధికారుల హామీ మేరకు మహారాష్ట్రలోని నాసిక్లో డ్రైవర్లు మంగళవారం సాయంత్రం ఆందోళన విరమించారు.
ఆందోళనల్లో భాగంగా డ్రైవర్లు మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో పెద్దయెత్తున నిరసనలు చేపట్టారు. బీహార్లోని పాట్నాలో రోడ్లను దిగ్బంధించారు. టైర్లు కాల్చి కొత్త చట్టానికి వ్యతిరేకంగా నినదాలు చేశారు. యాక్సిడెంట్ కేసుల్లో తాము 10 ఏండ్లు జైలు పాలైతే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలను ఎవరు పోషిస్తారని డ్రైవర్లు ఈ సందర్భంగా ప్రశ్నించారు. మహారాష్ట్రలోని థాణేలో ఆందోళనకారులు ముంబై-అహ్మదాబాద్ హైవేను బ్లాక్ చేశారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో ఒక పోలీసు అధికారికి గాయాలు కాగా, పోలీసు వాహనం ఒకటి దెబ్బతిన్నది. మధ్యప్రదేశ్లోని ధార్లో ప్రైవేటు బస్సు, ట్రక్కు డ్రైవర్లు పితంపూర్ హైవేను దిగ్బంధించారు. భోపాల్, ఛత్తీసగఢ్ రాజధాని రాయ్పూర్లో ఆందోళనలు జరిగాయి.
భారతీయ న్యాయ సంహిత చట్టంలోని డ్రైవర్లకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలను సవరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. యాక్సిడెంట్ అయితే ఆ కేసులో శిక్షను ప్రస్తుతం చట్టంలో ఉన్న 10 ఏండ్ల నుంచి 1-2 ఏండ్లకు తగ్గించాలని కోరారు. అనుకోని ఘటనల కారణంగా తాము జైలుపాలైతే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. భోపాల్కు చెందిన గ్యాన్సింగ్ యాదవ్ అనే క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ తన లాంటి క్యాబ్ డ్రైవర్లు ఎప్పుడో రాత్రికి ఇంటికి వెళ్తారని, ట్రక్కు డ్రైర్లు అయితే తమ కుటుంబసభ్యులకు దాదాపు 15 రోజుల పాటు దూరంగా ఉంటారని పేర్కొన్నారు. చట్టానికి తాము వ్యతిరేకం కాదని, అయితే శిక్షకు సంబంధించి సవరణలు చేయాలని కోరారు. సాధారణ డ్రైవర్లు అయిన తాము చట్టంలో పేర్కొన్న విధంగా అంత భారీ జరిమానాలను ఎలా కట్టగలమని మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన ట్రక్కు డ్రైవర్ సయ్యద్ వాజేద్ ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిల్లో ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టంలోని నిబంధల ప్రకారం.. హిట్ అండ్ రన్ యాక్సిడెంట్లు, ర్యాష్ డ్రైవింగ్ వంటివి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కిందకు వస్తాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 106లో రెండు క్లాజులు ఉన్నాయి. ర్యాష్ లేదా నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్తో ఒక వ్యక్తి మరణానికి కారణమై, ఘటన గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్కు సమాచారం ఇస్తే.. గరిష్ఠంగా ఐదేండ్ల జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉన్నదని 106(1)మొదటి క్లాజ్ చెబుతున్నది. 106(2) ప్రకారం నిర్లక్ష్య డ్రైవింగ్తో ఒక వ్యక్తి మరణానికి కారణమై, ఘటనపై పోలీసులు లేదా మేజిస్ట్రేట్కు సమాచారం ఇవ్వకుండా పారిపోయిన సందర్భంలో గరిష్ఠంగా పదేండ్ల వరకు జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు జరిమానా పడుతుంది. ప్రస్తుతం హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసులు ఐపీసీ సెక్షన్ 304ఏ కింద ఉన్నాయి. దీని ప్రకారం నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే గరిష్ఠంగా రెండేండ్ల జైలు శిక్ష మాత్రమే పడుతుంది. శిక్షతో పాటు జరిమానా లేదా రెండు పడే చాన్స్ కూడా ఉన్నది. కాగా, కొత్త చట్టం ప్రకారం యాక్సిడెంట్పై పోలీసులకు సమాచారం అందించినా లేదా బాధితుడ్ని సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లిన డ్రైవర్లు కఠిన నిబంధనల కింద విచారణ ఎదుర్కోబోరని నిపుణులు చెబుతున్నారు.