హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, ఈ నెల 25న హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్న ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ తదితర అంశాలపై చర్చించనున్నారు. వాటితోపాటు ప్రజాసమస్యలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్లీనరీలో చేయాల్సిన తీర్మానాలు మొదలైన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశమున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం పట్ల దేశవ్యాప్తంగా దళిత మేధావులు ఆసక్తి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో దీనిపై కూడా చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. మరోవైపు, 60 లక్షల సభ్యత్వమున్న పార్టీగా టీఆర్ఎస్ రికార్డు నెలకొల్పింది. కొన్నిచోట్ల జిల్లా పార్టీ కార్యాలయాలు ప్రాంభమయ్యాయి. మిగిలిన అన్నిచోట్ల జిల్లా కార్యాలయాలను త్వరగా ప్రారంభించి, కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రజలకు, ప్రభుత్వానికి పార్టీ శ్రేణులు వారధిగా పనిచేసేలా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని పార్టీవర్గాలు వెల్లడించాయి.