హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి మరే పార్టీకి లేదనే ధీమాను ఇనుమడింపజేసింది. 60 లక్షల సభ్యత్వంతో నిర్మాణాత్మకంగా దృఢంగా ఎదిగామని, భవిష్యత్తు అంతా టీఆర్ఎస్దేనని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం కార్యకర్తలకు టానిక్లా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. టీఆర్ఎస్ ఆవిర్భవించిన 2001లో తెలంగాణ వచ్చి తీరుతుందని కుండబద్ధలు కొట్టి, ఆ దిశగా ఉద్యమకార్యాచరణను అమలుచేసిన కేసీఆర్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల నేపథ్యంలోనూ అదే పట్టుసడలని ధీమాను నింపారు. 2028లో రాష్ట్ర బడ్జెట్ రూ.4 లక్షల 28 కోట్లకు చేరుతుందని సీఎం పేర్కొనడం పార్టీ శ్రేణులను మంత్రముగ్ధులను చేసింది. ‘సార్ నాయకత్వంలో అబ్బురపడే అభివృద్ధి కండ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. సార్ ఏదన్నా మాటంటే కచ్చితంగా జరిగి తీరుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉన్నది’ అని పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 31చోట్ల పార్టీ కార్యాలయాల నిర్మాణాలు పూర్తి చేసి, త్వరలో శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తామని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యాలయాలు నిర్మించుకొందామని ప్రకటించడం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపింది. ఈ ప్రకటన చేస్తున్న సమయంలో సభా ప్రాంగణమంతా జై కేసీఆర్.. జై టీఆర్ఎస్ నినాదాలు మిన్నంటాయి. పార్టీ బలమైన నాయకత్వంతోపాటు ఆర్థికంగా కూడా దృఢంగా ఉన్నదని, విరాళాల రూపంలో వచ్చిన రూ.425 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్గా ఉన్నాయని, కార్యకర్తల కోసమే రూ.20 కోట్ల బీమా చెల్లించినట్టు వివరించారు. రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధులు మహేశ్ బిగాల, అనిల్ కూర్మాచలం నేతృత్వంలో ప్రవాస తెలంగాణ ప్రతినిధులు కూడా విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు.
ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎంపీ వెంకటేశ్ నేతకానిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. వారిని దళిత్డైమండ్స్గా అభివర్ణించారు. దళితబంధు తీర్మానం సందర్భంగా ఇరువురు అద్భుతంగా ప్రసంగించారు. కథలు, సామెతలతో మెతుకు ఆనంద్ అందరినీ ఆకర్షించగా వెంకటేశ్ దళితబంధు గురించి ఆలోచన రేకెత్తించేలా మాట్లాడారు. దళితబిడ్డలకు అవకాశాలు కల్పిస్తే రత్నాల్లాగా తయారవుతారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మైనారిటీ సంక్షేమం, పోలీసు సంస్కరణలపై హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తనదైన శైలిలో ప్రసంగించారు. ఉర్దూలో ప్రసంగించిన అనంతరం తెలుగులోనూ మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు సభాప్రాంగణంలో నవ్వులు పూశాయి.