హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. కేంద్ర ప్రకటనతో శుక్రవారం టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. దేశంలో రైతు పోరాటాలకు నాయకత్వం వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన పర్యవసానాలను పరిగణనలోకి తీసుకొని ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడ్డాయి. హైదరాబాద్ తెలంగాణభవన్లో జరిగిన సంబురాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎన్ కార్యకర్తలు పటాకులు కాల్చి, నృత్యాలుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నదని పేర్కొన్నారు. రైతు ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ ఏడేండ్లుగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని చూసి దేశం నేర్చుకోవాలని సూచించారు. గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
రైతులకు మద్దతుగా బీజేపీ ప్రభుత్వంపై పోరాడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించగానే.. ప్రధాని మోదీ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనకి తీసుకున్నారు. న్యాయం జరిగే వరకు రైతులకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుంది. రైతుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటమాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన జవాబు చెప్పకుండా బీజేపీ ప్రభుత్వం తప్పించుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన ఎరువులను ఇవ్వకుండా, ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్కు తరలిస్తున్నది. పెట్రో ఉత్పత్తులపై బీజేపీ ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్ను వెంటనే ఉపసంహరించుకోవాలి. 18 సార్లు పెంచిన పెట్రో ఉత్పత్తుల ధరలను వెనకి తీసుకోవాలి. -బీ వినోద్కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
కర్షకుల కదనానికి కేంద్రం తలొగ్గింది. మోదీ ప్రకటన అభినందనీయం. విజయం సాధించిన రైతులకు అభినందనలు. ఈ చట్టాలు రైతుల మేలు కోసం కాదని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపల, బయటా మాట్లాడారు. భావసారూప్య పార్టీలను ఏకంచేసి, పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశాం. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై రైతుల ఆందోళనల ప్రభావం పడే అవకాశం ఉన్నదని బీజేపీ గ్రహించింది. సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉంటున్నారు. రాష్ట్రంలో పండిన వడ్లు కొనేంతవరకు టీఆర్ఎస్ పోరాటం ఆగదు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే సహించం.- నామా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత
ఇది దేశ రైతులందరి విజయం. రైతులు సత్యాగ్రహం ద్వారా కేంద్రం అహంకారాన్ని ఓడించారు. అన్యాయానికి వ్యతిరేకంగా అంతిమ విజయం సాధించారు. సీఎం కేసీఆర్ పోరాట సంకేతం సాగు చట్టాల రద్దుకు ఒక కారణం. దక్షిణాది రాష్ర్టాల్లో రైతు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రమాదమున్నదని గ్రహించిన కేంద్రం వెనక్కు తగ్గింది. రైతుల పోరాటంలో కాంగ్రెస్ పాత్ర శూన్యం. తెలంగాణలో పండించే మొత్తం వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. యాసంగిలో వరి పంటకు అనుమతివ్వాలి. – పల్లా రాజేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ