హుజూరాబాద్: సీఎం కేసీఆర్ మాత్రమే ముస్లింల బాగోగులు పట్టించుకుంటాడు. టీఆర్ఎస్ పాలనలోనే ముస్లింలకు భద్రత అని టీఆర్ఎస్ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మహ్మద్ శుకురోద్దీన్ అన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముస్లింను ఉప ముఖ్యమంత్రిగా నియమించి ముస్లిం లకు ప్రాధాన్యత ఇచ్చారని, రెండో సారి మంత్రివర్గంలో కూడా మహమూద్ అలీని హోం మినిష్టర్ చేశారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలా ముస్లింలకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. షాదీముబారక్ ద్వారా ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం అందిస్తున్న టీఆర్ఎస్ను మరువలేమని అన్నారు.
మౌజం, ఇమామ్లకు గౌరవవేతనం, గతంలో రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రభుత్వాలు అయినా పేదలకు బట్టల పంపిణీ చేశాయా అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ పాలన వచ్చిన తర్వాత ముస్లింలపై దాడులు జరిగాయని అన్నారు. బీజేపీ ముస్లింలకు చేసిందేమిటని శుకురోద్దీన్ ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. గెల్లు శ్రీనివాస్ కు టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ అవకాశం కల్పించారని మనమంతా ఆయనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మనందరికీ మేలు చేసే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటేనే న్యాయం జరుగుతుందని అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేస్తేనే మరింత అభివృద్ది జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహ్మద్ ఇమ్రాన్, గఫార్, గౌసోద్దీన్, ఫయాజ్, రియాజ్, సర్వర్, హుస్సేన్ తదితరులు ఉన్నారు.